త్వరలో హిమాచల్ ప్రదేశ్ సీఎం మార్పు.. ఆ తర్వాత లిస్ట్లో.. !
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా మార్చబోతున్నారా? అర్జెంటుగా ఢిల్లీ రావాలంటూ సీఎం జైరామ్ ఠాకూర్కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం వెనక కారణం ఏంటి?;
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా మార్చబోతున్నారా? అర్జెంటుగా ఢిల్లీ రావాలంటూ సీఎం జైరామ్ ఠాకూర్కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం వెనక కారణం ఏంటి? వారం వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో జైరామ్ ఠాకూర్ మార్పు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలను అధిష్టానం మారుస్తోంది. ఇప్పటికే ఉత్తరాఖండ్, కర్నాటక, గుజరాత్ ముఖ్యమంత్రులను మార్చారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ఢిల్లీ పర్యటన చేస్తుండడంపై పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చే జరుగుతోంది.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. మార్పులుచేర్పులు చేస్తోంది కమలదళం. హిమాచల్ ప్రదేశ్కూ వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దీంతో పాటు హర్యానా, మధ్యప్రదేశ్ సీఎంలను కూడా మారుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ను సీఎం పదవి నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పుపై మనోహర్లాల్ ఖట్టర్తో అమిత్ షా ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారానికి అమిత్షాతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు మనోహర్లాల్ ఖట్టర్. ఈ సందర్భంలోనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ను మార్చేంత సాహసం అధిష్టానం చేస్తుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.