Morbi Bridge Incident: ప్రమాదంపై సిట్ నివేదిక
గుజరాత్ మోర్బీలోని వంతెన ప్రమాదంపై సిట్ నివేదిక; గతేడాది వంతెన తెగి 135 మంది మృతి; సిట్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి; ప్రమాదానికి ముందే 22 తీగలు తెగిపోయాయి- సిట్; ప్రధాన కేబుల్లో దాదాపు సగం తీగలు తుప్పు పట్టాయి;
గుజరాత్లోని మోర్బీ నగరంలో గతేడాది జరిగిన వంతెన ప్రమాదంపై సిట్ నివేదిక విడుదల అయ్యింది. ఈ ఘటనలో 135 మంది మృతి చెందారు. అయితే సిట్ నివేదికతో కీలక విషయాలు వెలుగు వచ్చాయి. ప్రమాదానికి ముందే వంతనకు చెందిన 22 తీగలు తెగిపోయినట్లు సిట్ నివేదికలో వెల్లడి అయ్యింది. గుజరాత్ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల సిట్ నివేదికను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఇటీవలే మోర్బీ మున్సిపాలిటీకి అందజేసింది.
వంతెనకు చెందిన ఓ ప్రధాన కేబుల్లో దాదాపు సగం తీగలు తుప్పు పట్టి ఉండటం, పాత సస్పెండర్లనే కొత్త వాటితో వెల్డింగ్ చేయడం వంటి ప్రధాన లోపాలు ప్రమాదానికి దారితీసినట్లు సిట్ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.
1887 నాటి వంతెన రెండు ప్రధాన తీగల్లో.. నదికి ఎగువ వైపు కేబుల్ తెగిపోయి ప్రమాదం జరిగింది. ఇక తెగిపోయిన కేబుల్లో 22 వైర్లు అప్పటికే తుప్పు పట్టాయి. ప్రమాదానికి ముందే అవి తెగిపోయినట్లు తెలుస్తోంది. మిగితావి ప్రమాద సమయంలో ధ్వంసమయ్యాయని సిట్ తన నివేదికలో తెలిపింది. వంతెన పునరుద్ధరణ పనుల్లో భాగంగా పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేశారని, ఇదీ ప్రమాదానికి ఓ కారణమని తేల్చింది.
వంతనె కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది వంతెన సామర్థ్యం కంటే చాలా ఎక్కువని సిట్ నివేదికలో వెల్లడించింది. ఇక ప్లాట్ఫాంపై ఉన్న చెక్క పలకలను అల్యూమినియం ప్యానెళ్లతో మార్చడం కూడా ప్రమాదానికి ఓ కారణమని తెలిపింది. ఆ ప్యానెళ్ల కారణంగా వంతెన బరువు పెరిగిందని స్పష్టం చేసింది. చెక్క పలకలు ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని నివేదికలో పేర్కొంది. వంతెన పునః ప్రారంభానికి ముందు నిర్మాణ, సామర్థ్య పరీక్షలు చేయలేదని సిట్ బృందం తేల్చి చెప్పింది. ఇక గతేడాది ప్రమాదం తరువాత వంతెన మరమత్తులు, నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఒరేవా గ్రూప్ ఎండీ జయసుఖ్ పటేల్ సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.