Pakistan Crisis : శ్రీలంక పరిస్థితే పాక్‌లో పుట్టుకురానుందా..?

Pakistan Crisis : శ్రీలంక తరువాత పాకిస్థాన్ దివాలా తీసే పరిస్థితులు కనబడుతున్నాయి.;

Update: 2022-07-13 12:05 GMT

Pakistan Crisis : శ్రీలంకలో సంక్షోభం కళ్లముందు కనబడుతోంది.. శ్రీలంక తర్వాత దివాలా తీసే జాబితాలో ముందున్నది పాకిస్తానేనా..? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పర్వతంలా పేరుకుపోయిన అప్పులు, పాతాళానికి పడిపోతున్న విదేశీ మారక నిల్వలు.. ఇవన్నీ పాకిస్తాన్‌ దేశాన్ని ప్రమాదపుటంచుల్లో పడేస్తున్నాయి.. త్వరలోనే శ్రీలంక సిచ్యుయేషన్‌ పాక్‌లో తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మూడేళ్ల క్రితం శ్రీలంక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి.. ఇప్పుడు దాని పరిస్థితి ఎంతలా దిగజారిందో కళ్ల ముందు కనబడుతోంది.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు దక్షిణాసియాలోని చాలా దేశాల్లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. శ్రీలంక బాటలో మన పొరుగు దేశం పాకిస్తాన్‌ కూడా పయనిస్తోందనే చర్చ ఇప్పుడు తీవ్రమవుతోంది.

ఇప్పటికే పాక్‌ విదేశీ రిజర్వులు అడుగంటిపోతున్నాయి.. ప్రతినెలా ఇవి మరింత పతనం అవుతున్నాయి... ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక విద్యుత్తు సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అక్కడి పరిస్థితులే చెప్తున్నాయి..

దీనికి తోడు చైనా నుంచి తెచ్చుకుంటున్న అప్పులు పేరుకుపోతున్నాయి.. ఇలా అప్పులు తెచ్చుకోవడం దీర్ఘకాలిక పరిష్కారాన్ని ఎలా చూపించగలవని ఆ దేశ పౌరులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చివరకు ఈ కష్టాల నుంచి బయటపడేందుకు పాక్‌ ప్రభుత్వం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటోంది.. గాడిదల పెంపకాన్ని ప్రభుత్వమే స్వయంగా చేపడుతుంటే, ఖర్చులు తగ్గించుకోవడానికి టీ తాగొద్దంటూ ప్రజలకు సూచిస్తోంది.

గత ఏడాది జూన్‌ నాటికి పాకిస్థాన్‌ విదేశీ అప్పు 86.4 బిలియన్‌ డాలర్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 128 బిలియన్‌ డాలర్లకు చేరింది.. ఈ అప్పులే పాక్‌కు గుదిబండగా మారాయి. దీనికితోడు చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌పై అప్పు ఏకంగా 64 బిలియన్‌ డాలర్లకు చేరింది. మరోవైపు అక్కడి రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో పోడిపోతుండటంతో చెల్లింపుల మొత్తం కూడా విపరీతంగా పెరుగుతోంది..

2021-22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో పాకిస్తాన్‌ చెల్లించాల్సిన మొత్తం 10.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మరోవైపు దేశీయ అవసరాల కోసం దిగుమతులను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు.. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి పాక్‌ 80 బిలియన్‌ డాలర్ల విలువైన సరకులు దిగుమతి చేసుకొంది. ఫలితంగా కరెంటు ఖాతా లోటు మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 13.2 బిలియన్‌ డాలర్ల కరెంటు ఖాతా లోటు, విదేశీ అప్పులు చెల్లింపుల నిమిత్తం మరో 12 బిలియన్‌ డాలర్ల వరకూ అవసరం ఉంటుంది.

అటు చూస్తే పాకిస్తాన్‌ కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతోంది. తాజాగా ఒక డాలర్‌కు 207రూపాయల వద్దకు చేరింది. అదే సమయంలో కరెంటు ఖాతా లోటు కూడా భారీగా పెరిగింది. ప్రస్తుత రిజర్వు 10 బిలియన్‌ డాలర్ల లోపే ఉంది. మరోవైపు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రేలిస్టులో పాక్‌ పేరుండటంతో ఇన్వెస్టర్లు ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి సాహసించడం లేదు.. దీంతో విదేశీ మారకద్రవ్యం వచ్చే మార్గాలు కూడా కుచించుకుపోయాయి.

ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌, ప్రపంచ బ్యాంక్‌ల నుంచి వివిధ ప్రాజెక్టులకు అందాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో అధిక వడ్డీకి వాణిజ్య రుణాలు తీసుకొచ్చి అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పాకిస్తాన్‌ కొత్త అప్పులు చేయాలంటే పాత అప్పులు తీర్చాల్సిన పరిస్థితి నెలకొంది.

2013, 2016లో పాకిస్తాన్‌ విదేశీ అప్పులు తీసుకోగా.. 2021లో మరోసారి ఐఎంఎఫ్‌ వద్దకు వెళ్లింది.. 2 బిలియన్‌ డాలర్ల అప్పు కోరింది.. అయితే, చర్చలు విఫలం కావడం, ఐఎంఎఫ్‌ షరతులను అంగీకరించకపోవడంతో అప్పు పుట్టలేదు.. దీంతో చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలను సాయం కోరుతోంది.

ఇప్పుడు ఐఎంఎఫ్‌ షరతులన్నిటికీ ఓకే చెప్తే తప్ప పాకిస్తాన్‌ ఈ సంక్షోభం నుంచి ఒడ్డున పడే పరిస్థితి కనిపించడం లేదు.. ఇష్టమున్నా లేకపోయినా ఐఎంఎఫ్‌ చెప్పినట్లుగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిందే.. దిగుమతులు, వ్యయాల్లో కోతల విధించడం, అనవసర ఖర్చులు తగ్గించడం చేస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. మరి శ్రీలంక గతి పట్టకుండా ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు పాక్‌ ప్రభుత్వం ఏం చేస్తుంది.. చూడాలి..!

Tags:    

Similar News