ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణ్పుర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
బస్తర్ రేంజ్లోని దంతెవాడ- నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మాడ్ దండకారణ్యంలోని తుల్తులి, నెందూర్ గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు. అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ అనంతరం 30మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికీ ఆ ప్రాంతంలో అడపాదడపా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో 180మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.