Bharat Taxi App : భారత్ టాక్సీ యాప్ను ఆవిష్కరించిన అమిత్ షా
ఢిల్లీ, గుజరాత్లో సేవలు ప్రారంభించిన కేంద్రమంత్రి
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేతృత్వంలో మొట్టమొదటి సారిగా రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ను కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఎనిమిది అగ్ర సహకార సంస్థల మద్దతుతో డిసెంబర్ 2, 2025న ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో పైలట్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఈ పైలట్ ఆపరేషన్ రెండు నెలల్లో విజయవంతమైందని అమిత్ షా అన్నారు. ఈ సేవ మొదట ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో ప్రారంభించబడిందని.. రెండు సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనుందని చెప్పారు. మూడు సంవత్సరాల్లో భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు ప్రారంభించబడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. లాభాలు భారత్ టాక్సీతో అనుబంధించబడిన డ్రైవర్లతో పంచుకుంటామని హామీ ఇచ్చారు. వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కార్లు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.
డ్రైవర్లు రూ.500 పెట్టుబడితో వాటాదారులుగా మారవచ్చని అమిత్ షా అన్నారు. మూడేళ్లలో రూ.25 కోట్లు సంపాదిస్తే.. మొత్తంలో 20 శాతం సహకార మూలధనంగా ఉండనుందని.. మిగిలిన 80 శాతం డ్రైవర్లకు నడిపిన కిలోమీటర్ల ఆధారంగా పంపిణీ చేస్తామని వివరించారు. డ్రైవర్లే యజమానులు కాబట్టి లాభంలో వాటా ఉంటుందన్నారు. ఇక డ్రైవర్లు, రైడర్లు ఇద్దరికీ ఫిర్యాదుల పరిష్కారానికి యాప్, వెబ్సైట్లో విండో అందుబాటులో ఉంటుందని చెప్పారు. మహిళా రైడర్ల కోసం ‘‘సారథి దీదీ’ ఫీచర్ను త్వరలో యాప్లో ఉంచుతామన్నారు.
సహకార మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్ టాక్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్గా అవతరించిందని వెల్లడించింది. పైలట్ ప్రారంభం నుంచి మూడు లక్షలకు పైగా డ్రైవర్లు ప్లాట్ఫామ్లో చేరారు. లక్ష మందికి పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో ప్రతిరోజూ 10,000 కంటే ఎక్కువ రైడ్లు పూర్తయ్యాయి.
ఇప్పటి వరకు రెండు నెలల్లో రూ.10 కోట్లు డ్రైవర్లకు నేరుగా పంపిణీ అయింది. ఇక ఈ ప్లాట్ఫామ్ ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పదవీ విరమణ పొదుపులు, అంకితమైన మద్దతు వ్యవస్థ ద్వారా డ్రైవర్లకు సామాజిక భద్రతను ‘సారథిస్’గా పిలుస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఏడు ప్రదేశాల్లో సహాయ కేంద్రాలు పని చేస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో రైడ్-హెయిలింగ్ సర్వీస్ మార్కెట్లో ఉబెర్, ఓలా, రాపిడో వంటి కొన్ని సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు దీనికి పోటీగా సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ టాక్సీ అందుబాటులోకి వచ్చింది.