Arvind Kejriwal: మద్యం కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అయితే ఈ కేసులో వర్చువల్గా కోర్టుకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. లిక్కర్ స్కామ్లో తదుపరి విచారణ మార్చి 16వ తేదీన నిర్వహించనున్నారు.మరో వైపు ఇవాళ అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు. శుక్రవారం ఆయన బలనిరూపణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోసారి సమన్లు పంపిన ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ అరెస్ట్ చేయనుందన్న ఊహాగానాల మధ్య దిల్లీ సీఎం కేజ్రీవాల్ విశ్వాసపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దిల్లీ శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను భాజపా నేతలు సంప్రదించారని, త్వరలో తాను అరెస్ట్ అవుతానని వారు చెప్పినట్లు తమ ఎమ్మెల్యేలు పేర్కొన్నారని కేజ్రీవాల్ తెలిపారు.
అయితే ఎటు చూసినా ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష నెగ్గేలాగే కనిపిస్తున్నారు. ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 62, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ గెలవడం సునాయసంగానే కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఢిల్లీ అసెంబ్లీలో పెట్టిన విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్న వేళ.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.