Badrinath Temple: బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం... ?
హిందూయేతరులకు ప్రవేశం బంద్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు.
కేబీటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఇదివరకే గంగోత్రిధామ్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించారు. ఆదివారం జరిగిన గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేబీటీసీ ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.