Delhi: ఆప్ నేత సత్యేందర్ జైన్కు బెయిల్
తీహార్ జైలు దగ్గర సీఎం అతిషి హడావుడి,;
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి.. స్వయంగా తీహార్ జైలుకు వెళ్లి స్వాగతం పలికారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ఆప్ సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు.
కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి లావాదేవీల విషయంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2022 మే 30న సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 2015-16 సమయంలో హవాలా నెట్వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. ఈ హవాలా కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే సత్యేందర్తో పాటు ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఆరోగ్య సమస్యల కారణంగా గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తిరిగి మళ్లీ తిహాడ్ జైలుకు వెళ్లారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవలే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సత్యేందర్ జైన్కు బెయిల్ రావడంతో ఆప్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.