Bengaluru: బెంగళూరులో నీటి సమస్య తీవ్రం
ఫేస్ వాష్ కోసం వెట్ వైప్స్, కారు వాషింగ్, స్విమ్మింగ్ పూల్స్పై నిషేధం;
బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. ఎండాకాలం పూర్తిగా రాకముందే ప్రజలు మంచి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్లు ఇంకిపోవడంతో నల్లానీరు రాక అవస్థలు పడుతున్నారు. బిందెలు చేత పట్టుకుని వాటర్ ట్యాంకర్ల కోసం నిరీక్షిస్తున్నారు. కొన్ని ఎన్క్లేవ్లలో స్విమ్మింగ్పూల్ కార్యకలాపాలు, వాహనాల వాషింగ్పై నిషేధం విధించారు. నీటి దుర్వినియోగం చేసినవారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
బెంగళూరులో మంచి నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రిజర్వాయర్లలో నీరు లేక నల్లాల ద్వారా నీటి సరఫరా చాలా చోట్ల నిలిచిపోయింది. అపార్ట్మెంట్వాసులు నీటి కోసం ఎక్కువ డబ్బు వెచ్చించి.. ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. అలా కూడా నీరు దొరకడం కష్టంగా మారినట్లు తెలిసింది. మంచి నీటి సరఫరాపై BWSSB అధికారులు ఎప్పటికప్పుడు నగరవాసులకు సమాచారం ఇస్తున్నారు.
నగరంలోని చాలా నివాస సముదాయాలలో మంచి నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టుకుంటున్నారు. వాహనాలను శుభ్రం చేయడం, స్విమ్మింగ్పూల్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ ఎన్క్లేవ్లో నివాసితులు చేతులు, ముఖం కడుక్కోవడానికి వెట్ వైప్స్ను వాడుకోవాలని సూచనలు జారీ చేశారు. పరిస్థితి మరింత దిగజారితే.. ఇళ్లలో స్టీల్ పాత్రలకు బదులుగా వాడిపడవేసే డిస్పోజల్ స్పూన్లు, పాత్రలను తెచ్చుకోవాల్సి ఉంటుందని ముందుగానే హెచ్చరిస్తున్నారు. వైట్ఫీల్డ్లోని ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో నీటి దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు భద్రతా సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ బోర్లలో నీరు వస్తున్నా అది ఏ క్షణమైనా నిలిచిపోతుందన్న భయంతో నీటి వినియోగాన్ని 20 శాతానికి తగ్గించుకోవాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే 5వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
సమస్యపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. నీటి డిమాండ్ను తీర్చడానికి కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా యత్నిస్తోందని తెలిపారు. పట్టణాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని వనరులను వినియోగించుకుని నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. బెంగళూరుకు రామనగర, హోస్కోట్, చన్నపట్న, మాగాడి పట్టణాల నుంచి ట్యాంకర్లను తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి నీరందించే మేకేదాటు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. తన ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు