Cab Driver Blackmail : క్యాబ్ డ్రైవర్ ఎదురుగానే అన్నీ మాట్లాడేసింది.. చివరికి..
బ్లాక్ మెయిల్ చేసి రూ. 82 లక్షల విలువ చేసే బంగారం, డబ్బు కాజేసాడు.;
కర్ణాటకలో ఓ మహిళను తెలివిగా మోసం చేశాడు క్యాబ్ డ్రైవర్. కొద్ది రోజుల క్రితం తన క్యాబ్లో ప్రయాణించిన మహిళను.. తన చిన్నప్పటి క్లాస్మేట్లా నమ్మించాడు. ఫోన్ చేసి ఆమె నుంచి రూ.22 లక్షలు రాబట్టుకున్నాడు. అలాగే 750 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో 35 ఏళ్ల ఆ క్యాబ్ డ్రైవర్ను ఆర్ఎం నగర్ పోలీసులు ఆగస్టు 2న అరెస్టు చేశారు.
బెంగళూరులో క్యాబ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లో వేరే స్నేహితులతో తన అఫైర్ గురించి మాట్లాడటమే ఆమె చేసిన తప్పు.. ఆ మాటలు ఆధారంగా ఓ కధ అల్లాడుఆ క్యాబ్ డ్రైవర్. ఆమెకు పాత స్నేహితుడిగా ఫోన్ చేస్తూ నటిస్తూ మోసగించాడు. డబ్బు అడిగాడు.. తరువాత , బంగారాన్ని కూడా లాగేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గతేడాది ఇందిరానగర్ నుంచి బనస్వాడికి కిరణ్ కుమార్ నడుపుతున్న క్యాబ్ను బుక్ చేసింది. ఆమె స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయాలను చర్చించింది. స్నేహితురాలి సలహాలు కోరుతుండగా, కుమార్ విన్నాడు. నవంబర్ 2022లో, అతను మహిళ చిన్ననాటి స్నేహితుడిగా నటించి ఫోన్ చేసాడు. ఆమె సమస్యలు అన్నీ తనకు తెలుసనీ, వాటిని పరిష్కరించడానికి సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు. అందుకు ఆ మహిళ అంగీకరించింది.
కొంచెం డబ్బు అవసరం ఉందని అడగటంతో.. నిజంగానే అతడు తన పాత స్నేహితుడని భావిస్తున్న మహిళ కిరణ్ కుమార్ బ్యాంక్ అకౌంట్కి రూ.22 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. కొన్ని రోజులు గడిచాక అతడు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదని తెలుసుకున్న ఆ మహిళ అతనితో మాట్లాడటం మానేసింది. కానీ కిరణ్ మాత్రం ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నీకు మరొకరితో ఎఫైర్ ఉందన్న విషయం నీ భర్తకు చెప్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. అతడు అడిగినట్లుగానే తన దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసింది. ఇటీవల భర్త బంగారం ఎక్కడా అని అడగగా.. ఆమె నిజం బయట పెట్టింది. కేశ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కొంత డబ్బు, తాకట్టు పెట్టిన బంగారం రికవర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత సమాచారాన్ని చర్చించవద్దని పోలీసులు మరోసారి ప్రజలను హెచ్చరించారు.