Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు;

Update: 2024-11-28 06:00 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఒక రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ కనిపిస్తుంది. ఈరోజు  ఉదయం మరోసారి హస్తినలో కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కి చేరిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ఇండియా గేట్ దగ్గర భారీగా పొగమంచు కమ్ముకోగా.. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపు నురుగు భారీగా తేలియాడుతోందని పేర్కొనింది.

ఇక, గాలి కాలుష్యం వల్ల కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని పలువురు బాధితులు చెప్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురుస్తున్న పొగ మంచు.. ప్రజలపై సూర్య కిరణాలు పడకుండా అడ్డుకుంటుంది. దీని ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతున్నాయని ఎయిమ్స్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మనవ శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూల కారణంగా అని తెలిపింది. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా నిలువరిస్తుందన్నారు.

అయితే, ఎయిమ్స్‌ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో పొగ మంచు వల్ల ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడుతుంది.. దీంతో చాలామంది విటమిన్ డి లోపం బారిన పడుతున్నారని నివేదికలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ గాలి కాలుష్య స్థాయి పెరగడం.. పొగమంచు సమస్య తీవ్రతరమైందన్నారు. ఈరోజు దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Tags:    

Similar News