SM Krishna: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత
1999-2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ.;
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఈరోజు (డిసెంబర్ 10) తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని సదాశివనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు 92 ఏళ్లు కాగా.. వృద్ధాప్య వ్యాధితో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణను చికిత్స నిమిత్తం తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డా. సత్యనారాయణ మైసూర్, డా. సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఎస్ఎం కృష్ణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
మే 1, 1932న కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లి గ్రామంలో జన్మించిన ఎస్ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. ఎస్ఎం కృష్ణ తన ప్రాథమిక విద్యను హత్తూరులో, సెకండరీ విద్యను మైసూర్లోని శ్రీ రామకృష్ణ విద్యాశాలలో, తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ని మైసూర్లోని మహారాజా కాలేజీలో, లా డిగ్రీని యూనివర్సిటీ లా కాలేజీలో పూర్తి చేశాడు. ఆయన డల్లాస్, టెక్సాస్, యూఎస్ఏలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.
స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాలలోకి
1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఎస్ఎం కృష్ణ.. రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ‘ప్రజా సోషలిస్టు పార్టీలో’ చేరారు. అయితే 1967 ఎన్నికల్లో మద్దూరు నుంచి కాంగ్రెస్కు చెందిన ఎంఎం గౌడ్పై ఓడిపోయారు. 1968లో సిట్టింగ్ ఎంపీ మరణించడంతో మాండ్య లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968 ఉప ఎన్నికల తర్వాత మాండ్య నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యాను కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టడంలో ఎస్ఎం కృష్ణ కీలక పాత్ర పోషించారు.
పాంచజన్య యాత్ర నుంచి ముఖ్యమంత్రి వరకు…
1999లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఆ సందర్భంగా ఎస్ఎం కృష్ణ చేపట్టిన పాంచజన్య యాత్ర కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్కు సత్తా చాటింది. ఎస్ఎం కృష్ణ 1999 నుండి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. డిసెంబర్ 2004లో మహారాష్ట్ర గవర్నర్గా నియమితులైన కృష్ణ 5 మార్చి 2008న మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికై, 2009 మే 22న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.