ఏడాది చివరికి రూ. లక్షా 25 వేలకు బంగారం ధర..!

రానున్న రోజుల్లో మరింత పెరగనున్న పసిడి ధరలు...ఏడాది చివరికి లక్ష పాతిక వేలు కానున్న బంగారం ధర;

Update: 2025-04-19 05:00 GMT

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 10 గ్రాముల... 24 క్యారెట్ల బంగారం రూ. 96,170 నుంచి రూ.96,310 పలుకుతుండగా రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. 2025 ఏడాది చివరి నాటికి 24 క్యారెట్ల పసిడి ధర రూ.1.25 లక్షలకు చేరే అవకాశం ఉందని బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేల నుంచి రూ. 89,210 గా ప‌లకగా, కేజీ వెండి ధర లక్షకు చేరువైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు, ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని తెలిపింది.

కోలుకుంటున్న మార్కెట్లు

దేశాల మధ్య ట్రేడ్ వార్ పెరిగితే.. బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గోల్డ్‌మన్‌ సాచ్స్‌ సైతం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ట్రంప్‌ ప్రతీకార సుంకాలు విధింపుతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. పెట్టుబడుల కోసం మదుపరులు పసిడి వైపు మొగ్గుచూపుతుండగా మార్కెట్‌లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే సుంకాల నుంచి చైనా మినహా అన్ని దేశాలకు కొన్ని రోజులు గడువు ఇవ్వటంతో ఈక్విటీ మార్కెట్లు నెమ్మదిగా తేరుకుంటున్నాయి.

పెరిగిన దిగుమతులు

ఇదిలా ఉండగా బంగారం ధరలు ఓవైపు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ దానిపై మోజు మాత్రం తగ్గడం లేకపోవటంతోనే పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు బంగారం ధరలు దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసింది. మార్చి నెలతో పోలిస్తే దిగుమతుల విలువ 191.13 శాతం పెరిగి 4.47 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి మార్చి మధ్య సుమారు 58 బిలియన్‌ డాలర్ల బంగారం దిగుమతి అయ్యింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం 45.54 బిలియన్‌ డాలర్లుగా ఉందని పేర్కొంది. బంగారం అంత కాకపోయినా.. వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా డిమాండ్ లేకపోయినా.. ధరల పెరుగుదల విషయంలో వెండి నిలకడగా సాగుతోంది.

Tags:    

Similar News