SRO: ఇస్రో ఖాతాలో మరో విజయం ..
రోదసిలోకి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లిన GSLV F14రాకెట్;
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. GSLV-F14 వాహకనౌక ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్ -3DSను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5గంటలా 35నిమిషాలకు...ఇన్శాట్ -3DS ఉపగ్రహాన్ని మోసుకుని GSLV-F14 వాహక నౌక... నింగిలోకి దూసుకెళ్లింది.
మొత్తం 2వేల 274 కిలోల బరువు కలిగిన ఇన్శాట్ –3DS ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులోని...భూస్థిర కక్ష్యలో GSLV-F14 వాహకనౌక ప్రవేశపెట్టింది. GSLV సిరీస్లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లతో చేపట్టిన పదో ప్రయోగామని ఇస్రో తెలిపింది. ఇన్శాట్ 3DS మూడోతరం వాతావరణ ఉపగ్రహంకాగా ఈ ప్రయోగానికి భూగోళ శాస్త్ర మంత్రిత్వశాఖ నిధులు సమకూర్చింది. ఈ ఉపగ్రహం భూమి, సముద్రాల ఉపరితలంపై వాతావరణాన్ని అంచనా వేయనుంది. విపత్తులకు సంబంధించి ముందే హెచ్చరక చేయనుంది. ఈ ఉపగ్రహం సేవలను...వాతావరణ విభాగంతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించుకోనున్నాయి. ఇన్శాట్ 3DS ఉపగ్రహం పదేళ్లు సేవలు అందించనుంది. గతంలో వాతావరణ సేవల కోసం... 2013లో ఇన్శాట్ -3D, 2016లో ఇన్శాట్ -3DR ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
వాతావరణ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్లో భాగస్వాములైన అందరికీ అభినందలు తెలిపారు. ఇన్శాట్-3డీఎస్ వివరాలను పంచుకున్నారు.
ఇన్శాట్-3DS ప్రయోగం విజయవంతం కావడంపై పలువురు ప్రముఖులు ఎక్స్ వేదిక ద్వారా ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం విజయం కావడంపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ... ప్రోత్సాహంతో ఇస్రో బృందం ఒకదాని తర్వాత మరొక విజయం సాధిస్తోందన్నారు. ఈ తరుణంలో అంతరిక్ష విభాగంతో అనుబంధం కలిగి ఉన్నందుకు గర్వంగా ఉందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు