Time Machine: వయసును తగ్గిస్తాం అంటూ టోకరా

ఏకంగా రూ.35 కోట్ల మేర వసూలుచేసిన నిందితులు;

Update: 2024-10-05 03:30 GMT

అరవయ్యేళ్ల వృద్ధులను పాతికేళ్ల యువకులుగా మార్చుతామంటూ ఇద్దరు దంపతులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్‌ కుమార్‌ దూబే, ఆయన భార్య రష్మి కలిసి రివైవల్‌ వరల్డ్‌ అనే థెరపీ సెంటర్‌ను ప్రారంభించారు. తాము ఇజ్రాయెల్‌లో తయారైన ఓ టైమ్‌ మెషీన్‌ను తీసుకొచ్చామని, దాని ద్వారా వృద్ధులను తిరిగి యువకులుగా మార్చుతామని ప్రచారం చేశారు.

జనం అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఘటనలు దేశంలో నిత్యకృత్యంగా మారిపోయాయి. వీటిపై పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా జనాల్లో మాత్రం చైతన్యం రావడం లేదు. మోసగాళ్ల మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకుని.. తర్వాత లబోదిబోమంటున్నారు. తాజాగా, ఓ భార్యభర్తలు టైమ్ మెషీన్‌తో మీ వయసు తగ్గించేస్తామని జనాలను బురిడీ కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయేల్‌కు చెందిన టైమ్ మెషీన్‌తో మీ వయసును వెనక్కి తీసుకెళ్తామని చెబితే.. వేలంవెర్రిగా జనం నమ్మి వారికి కోట్లు సమర్పించుకున్నారు. చివరకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మోసపోయామని గ్రహించారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన రాజీవ్ కుమార్ దూబే, అతడి భార్య రష్మీ దూబే‌లు నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ థెరపీ సెంటర్ ప్రారంబించారు. ఇజ్రాయేల్‌ నుంచి తీసుకొచ్చిన టైమ్ మెషీన్‌లతో 60 ఏళ్లు వయసును 25 ఏళ్లకు తగ్గించేస్తామని ప్రచారం చేశారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా పండు ముసలోళ్లు పడుచు యువకలుగా మారిపోతారని నమ్మించారు. గాలిలో కాలుష్యం వల్ల వేగంగా వృద్ధాప్యం వస్తోందని, ‘ఆక్సిజన్ థెరపీ’ వల్ల నెలరోజుల్లోనే మార్పు వస్తుందని చెప్పారు.

దీని కోసం ఆక్సిజన్‌ థెరపీకి 10 సెషన్లకు రూ.6,000; మూడేళ్లపాటు చికిత్సకు రూ.90,000 చెల్లించాలని చెప్పారు. వీరి మోసానికి గురైన బాధితురాలు రేణు సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ.10.75 లక్షలు తీసుకున్నారని, తనను మోసం చేశారని ఆరోపించారు. చాలా మందిని ఇలా మోసం చేసి, సుమారు రూ.35 కోట్లు దండుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించడంతో ఈ దంపతులిద్దరూ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News