Jeeva Samadhi: కేరళలో బాబా సజీవ సమాధి.. మృతదేహం ధ్యానస్థితిలోనే దర్శనం!

పలు అనుమానలతో మృత‌దేహాన్ని వెలికితీసిన పోలీసులు;

Update: 2025-01-17 00:30 GMT

కేరళకు చెందిన ఓ బాబా ఇటీవలే జీవ సమాధి అయ్యారు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెల్సిన ఈ విషయాన్ని వాళ్లే పోస్టర్ల ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. దీనిపై స్థానికులంతా అనుమానం వ్యక్తం చేశారు. కళ్లు సరిగ్గా కనిపించని ఆ బాబా జీవ సమాధి అయ్యుండరని.. కుటుంబ సభ్యులే ఏమైనా చేసి ఇలా నాటకాలు ఆడుతున్నారేమోనని ఆరోపించారు. ఇలా ఈ కేసులోకి పోలీసులు, కలెక్టర్ ఎంట్రీ ఇవ్వగా.. హైకోర్టు వరకూ వెళ్లింది. దీంతో న్యాయస్థానం ఆ జీవ సమాధిని తవ్వాలని పోలీసులకు సూచించగా.. ఈరోజు పోలీసులు దాన్ని తవ్వారు. ఈక్రమంలోనే బాబా మృతదేహం ధ్యాన స్థితిలో కనిపించగా.. అంతా షాక్ అయ్యారు. 

కేరళలోని తిరువనంతపురంకు చెందిన గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ ఇటీవలే జీవ సమాధి అయ్యారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ఆయన కుటుంబ సభ్యులే పోస్టర్ల ద్వారా స్థానికులు అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఎవరికీ తెలియకుండా ఓ దేవాలయం సమీపంలో అతడిని పూడ్చి పెట్టడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని భావించారు. ఈక్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులను అందరూ ప్రశ్నించగా.. ఎవరికీ తెలియకుండానే తనను జీవ సమాధి చేయాలని మణ్యన్ కోరినట్లు ఆయన కుమారులు సనందన్, రాజేశన్ వివరించారు.

అయినా ఇదంతా నమ్మశక్యంగా లేకపోయేసరికి స్థానికులు, బంధువులు అందరూ పోలీసులను ఆశ్రయించారు. అలా కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఈక్రమంలోనే సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు. కానీ మణ్యన్ కుటుంబ సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఆయన జీవ సమాధిని తవ్వనివ్వలేదు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి న్యాయపరంగా వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అలా ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. ఈక్రమంలోనే విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మణ్యన్ జీవ సమాధిని తవ్వాలని జనవరి 15వ తేదీన పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈక్రమంలోనే పోలీసులు ఈరోజు ఉదయం 7 గంటలకు మణ్యన్ జీవ సమాధిని తవ్వారు. కాంక్రీట్‌తో కట్టిన సమాధిని పగులగొట్టారు. అయితే అందులో అతడు ధ్యాన స్థితిలో కనిపించగా.. ఆయన మృతదేహాన్ని బయటు తీశారు. ఛాతి వరకు పూజా సామగ్రి ఉండగా.. పీఠముడి వేసుకుని ఆయన కూర్చున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించినట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News