Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ..

పవిత్ర గ్రంథం 'భగవద్గీత' బ‌హూక‌ర‌ణ‌

Update: 2025-12-05 05:00 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకు నిన్న‌ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాలం విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన పవిత్ర గ్రంథం 'భగవద్గీత'ను మోదీ బహూకరించారు.

గురువారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్న పుతిన్‌ను స్వాగతించిన అనంతరం, ఇరువురు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లారు. అక్కడ పుతిన్ గౌరవార్థం మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. "నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు భారత్‌కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మా చర్చల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది" అని పేర్కొన్నారు.

ఇక, ఇవాళ‌ పుతిన్ పర్యటన బిజీగా సాగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు అధికారిక స్వాగతం లభిస్తుంది. అనంతరం 11:30 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీలో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

మధ్యాహ్నం 1:50 గంటలకు ఇరు దేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడతారు. సాయంత్రం భారత వ్యాపార ప్రముఖులతో సమావేశమై, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన రష్యాకు తిరుగు ప్రయాణమవుతారు.

Tags:    

Similar News