ప్రధాని నరేంద్రమోడీ వారణాసి పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్పైకి చెప్పులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే, ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత రాలేదు.
మూడోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి వారణాసిలో పర్యటించిన సమయంలో ఈ ఘటన జరిగింది. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ నుంచి కేవీ మందిర్కు మోదీ కాన్వాయ్ రోడ్ షోగా వెళ్తున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1.41 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 19 సెకన్ల తర్వాత ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి.. చెప్పు విసిరినట్లు కనిపిస్తోంది. అది కాస్తా వచ్చి ప్రధాని ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు బానెట్పై పడినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది.. 5, 6 సెకన్ల వ్యవధిలోనే చేతితో తీసి పక్కకు విసిరేయడం కనిపిస్తోంది. ఇక ఆ వీడియోలో మోదీ మోదీ అంటూ వారణాసి ప్రజలు నినాదాలు చేయడం వినిపిస్తోంది.
అయితే అది చెప్పేనా లేక ఏదైనా వస్తువా అనేది తెలియలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఓ ఉత్తర్ప్రదేశ్ పోలీస్.. అది చెప్పు కాదని.. సెల్ఫోన్ అని పేర్కొన్నారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని తెలిపారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినప్పటికీ ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రోజున ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో పంజాబ్లో కూడా ఇలాగే ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యం ఎదురైంది. కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్పై కాన్వాయ్ నిలిచిపోయింది.