Narendra Modi: ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ
ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదన్న ప్రధాని;
లోక్సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడివిడిగా లేఖలు రాశారు. భారత వర్తమానాన్ని మెరుగైన భవిష్యత్తుతో అనుసంధానించేందుకు ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సందేశం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికీ చేరేలా బీజేపీ కసరత్తులో ఈ లేఖ భాగంగా కనిపిస్తోంది. కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తు్న్న తమిళనాడు చీఫ్ అన్నామలైకి లేఖ రాశారు. ఆయనతో పాటు పలు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రాంతీయ భాషల్లోనూ ప్రధాని లేఖ రాశారు. ఈ లేఖ రావడంతో అభ్యర్థులు ఆశ్చర్యపోతున్నారు. ఈ లేఖ తమ నియోజకవర్గంలో ప్రతీ ఓటరికి చేరేలా చూస్తామని చెప్పారు
‘‘గత పదేళ్లలో సమాజంలో అన్ని వర్గాలవారి జీవన నాణ్యత మెరుగుపడింది. వారి కష్టాలు చాలావరకు తొలగిపోయాయి. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రతిఒక్కరికీ మెరుగైన జీవితాన్ని అందించాలన్న మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఎన్నికలు అత్యంత నిర్ణయాత్మకమైనవి. భాజపాకు వచ్చే ప్రతి ఓటు.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు దోహదపడుతుంది. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో భారత్ చేస్తున్న ప్రయాణానికి మరింత వేగాన్ని అందిస్తుంది’’ అని లేఖలో వ్యాఖ్యానించారు.
‘‘ మన వర్తమానాన్ని ఉజ్వల భవిష్యత్తుతో అనుసంధానించడానికి ఈ ఎన్నికలు ఒక చక్కటి అవకాశం. ఎన్డీయేకి పడే ప్రతి ఓటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడుతుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే మా లక్ష్యానికి ఈ ఎన్నికలు ఊపు ఇస్తాయి. ఎన్నికల్లో కీలకమైన ఈ సమయంలో మీరు (అభ్యర్థులు), పార్టీ శ్రేణులు చక్కగా ప్రచారం చేయండి. సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి’’ అని సూచించారు.
‘‘ మీ ఆరోగ్యాన్ని, మీతోపాటు ఉండే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలని అభ్యర్థుల్ని కోరుతున్నాను. తీవ్రమైన ఎండలు ఇబ్బందికరంగా ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని. కాబట్టి ఎండ తీవ్రత పెరగకముందే ఉదయాన్నే ఓట్లు వేయాలంటూ ఓటర్లకు చెప్పండి. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతుందనే నా సందేశాన్ని ఓటర్లకు చేరవేయండి. నా సహచర అభ్యర్థులు అందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను’’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందువల్ల ఉదయమే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన సందేశాన్ని ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లకు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్న కె.అన్నామలై, ఉత్తరాఖండ్లోని పౌడీ గఢ్వాల్ల నుంచి పోటీ చేస్తున్న అనిల్ బలూనీలకు మోదీ రాసిన లేఖలను భాజపా వర్గాలు మీడియాతో పంచుకున్నాయి.