PM Modi: ఆ టన్నెల్ ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది: ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో నిర్మించిన నూతన టన్నెల్ అద్భుతమన్న ప్రధాని;
జమ్మూకశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో ‘జడ్ మోడ్’ టన్నెల్ నిర్మాణం పూర్తయింది. దీని ప్రయోజనాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పెట్టిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. టన్నెల్ నిర్మాణంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. ప్రారంభోత్సవానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మోదీ మనసుకు నచ్చిన ఆ సొరంగ మార్గం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్ము అండ్ కశ్మీర్ గందర్బల్ జిల్లాలోని సోన్మార్గ్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఓ భారీ టన్నెల్ను నిర్మిచింది. అయితే చాలా కాలం క్రితమే ఆ నిర్మాణ పనులను ప్రారంభించగా.. ఇటీవలే ఆ టన్నెల్ పూర్తి అయింది. దాదాపు 2 వేల 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో.. 12 కిలో మీటర్ల మేర ఈ టన్నెల్ను నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 5 వేల 650 అడుగుల ఎత్తులో ఉంది. ఈక్రమంలోనే ఆ టన్నెల్ను డిసెంబర్ 13వ తేదీ సోమవారం రోజు ప్రారంభించాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సోన్మార్గ్ సొరంగాన్ని నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ప్రారంభించనున్నారు.
ఈక్రమంలోనే జమ్ము అండ్ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ సొరంగ మార్గం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా చెబుతూ.. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నందున.. ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను అక్కడకు వెళ్లినట్లు వివరించారు. అయితే ఈ సొరంగం ఏడాది పొడవునా.. పర్యాటకుల కోసం తెరిచే ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని స్కై రిసార్ట్గా అభివృద్ధి చేసేందుకు సర్కారు సిద్ధమైందని స్పష్టం చేశారు. అలాగే శీతాకాలంలో ఇక్కడి ప్రజలంతా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని రాసుకొచ్చారు. అలాగే శ్రీనగర్ నుంచి కార్గిల్ లేహ్కి ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని వెల్లడించారు.