judge cash row: జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల గుట్టలు నిజమే- నిర్ధారించిన త్రిసభ్య కమిటీ

విధుల నుంచి తొలగించాలని సిఫార్సు;

Update: 2025-06-20 00:30 GMT

ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న మాట వాస్తమేనని, ఆయనను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. జస్టిస్‌ వర్మ నివసిస్తున్న తుగ్లక్‌ క్రీసెంట్‌లోని అధికారిక గృహంలో మార్చి 14 రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక, పోలీసులకు ప్రమాదం జరిగిన స్టోర్‌ రూమ్‌లో పెద్దయెత్తున నోట్ల కట్టలు కన్పించాయి. అందులో కొన్ని కాలిపోయాయి. ఆ నోట్ల గురించి తనకేమీ తెలియదని, అవి తనవి కావని వర్మ బుకాయించారు. దీనిపై పెద్దయెత్తున మీడియాలో ప్రచారం జరగడంతో కలుగజేసుకున్న సుప్రీం కోర్టు ఆయనను వెంటనే అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసి, ఆయనపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. పంజాబ్‌ హర్యానా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్‌ 10 రోజుల పాటు ఈ విచారణ నిర్వహించింది. ఒక సాధారణ అగ్నిప్రమాదంలా ప్రారంభమైన ఈ సంఘటన ఇప్పుడు న్యాయవ్యవస్థ దుష్ప్రవర్తన, ప్రజల విశ్వాస ఉల్లంఘన అనే అంశాలపై చర్చకు దారితీసింది. తాజాగా ఈ కమిటీ విచారణను పూర్తి చేసి సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించింది. నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తన నివేదికలో నిర్ధారించింది.

జస్టిస్‌ వర్మ నివాస గృహంలో పెద్దయెత్తున నోట్ల కట్టలు ఉన్నట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారని, దీనికి దృశ్య ఆధారాలు కూడా ఉన్నాయని కమిటీ తెలిపింది. కానీ జస్టిస్‌ వర్మ ఎప్పుడూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, న్యాయశాఖ అధికారులకు తెలియజేయడం కానీ చేయలేదని విచారణ కమిటీ పేర్కొంది. ఈ విషయంలో జస్టిస్‌ వర్మ ప్రవర్తన అసహజంగా ఉందని పేర్కొంటూ ఆయనను విధుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది.

ఆమోదయోగ్యమైన వివరణ ఇవ్వలేదు..

తమ కమిటీ జస్టిస్‌ వర్మ కుమార్తె సహా 55 మంది సాక్షులను విచారించిందని, స్టోర్‌ రూమ్‌ నేలపై చెల్లాచెదురుగా పెద్దయెత్తున పడి ఉన్న 500 నోట్ల కట్టలు ఉన్నట్టు వీడియోలు, ఫొటోలు వంటి ధ్రువీకరించే సాక్ష్యాలు అగ్నిమాపక, పోలీస్‌ శాఖల నుంచి సేకరించిందని కమిటీ తెలిపింది. తన ఇంట్లో అంత పెద్దయెత్తున నోట్ల కట్టలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆయన ఆమోదయోగ్యమైన వివరణ ఇవ్వలేదని, ఆ నోట్ల గురించి తనకు తెలియదనడం నమ్మశక్యంగా లేదని కమిటీ పేర్కొంది. ఒక వేళ ఈ విషయంలో ఆయనపై కుట్రే కనుక జరిగితే జస్టిస్‌ వర్మ భారత ప్రధాన న్యాయమూర్తికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కమిటీ ప్రశ్నించింది. మంటలను ఆర్పివేసిన తర్వాత స్టోర్‌ రూమ్‌ను శుభ్రం చేసి, ఆధారాలు లేకుండా చేసిన వారిలో వర్మ కుమార్తె, ఆయన ప్రైవేట్‌ కార్యదర్శి రాజేందర్‌ సింగ్‌ కర్కి ప్రమేయం ఉండొచ్చని కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. వర్మపై ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసిన సీజేఐ ఆయనకు ఎలాంటి న్యాయ విధులను అప్పగించ లేదు. కాగా, తనపై విచారణ జరుగుతున్న క్రమంలో వర్మ తన పదవికి రాజీనామా చేయలేదు.

Tags:    

Similar News