Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్ ఉంటుంది కానీ డిలీట్ కూడా చేసుకోవచ్చు..
సైబర్ నేరాలను అరికట్టేందుకేనని ప్రభుత్వం వివరణ
సంచార్ సాథీ యాప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా కీలక ప్రకటన చేశారు. స్మార్ట్ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచి సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ యాప్ తప్పనిసరి కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో స్మార్ట్ఫోన్లు తయారు చేసే కంపెనీలకు ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. కచ్చితంగా స్మార్ట్ఫోన్లలో ప్రభుత్వ సంబంధిత సంచార్ సాథీ యాప్ను ప్రీ-ఇన్స్టాల్ చేసి ఉంచాలని పేర్కొన్నది. ఆ ఆదేశాలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. సంచార్ సాథీ యాప్ వల్ల గోపత్యకు భంగం కలిగే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు చెబుతున్నారు.
కేంద్రం ఏమందంటే ..
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, మోసగాళ్లు ఫిషింగ్ మెయిల్స్, మెసేజులు, ఏపీకే ఫైల్స్ పంపిస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాట్సాప్, మెసేజ్, ఫోన్ కాల్స్.. ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వివరించాయి. స్పామ్ కాల్స్, మెసేజ్ లతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాయి. ఈ మోసాలను అరికట్టేందుకే సంచార్ సాథీ యాప్ ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
మొబైల్ ఫోన్లలో డీఫాల్ట్ గా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది. ఇందుకోసమే సంచార్ సాథీ యాప్ ను ఇన్ స్టాల్ చేయాలని మొబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. కాగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై మొబైల్ తయారీ కంపెనీలు ఇంకా స్పందించలేదు.