SC: వీధికుక్కల అంశంపై సుప్రీం ఆదేశాల సవరణ
హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ధర్మాసనం స్పష్టం;
వీధి కుక్కల తరలింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ఢిల్లీ ఎన్సీఆర్లో మొత్తం వీధి కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, మళ్ళీ వాటిని వొదిలేయడం, దత్తత తీసుకోవడం వంటి విషయాలపై కూడా మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించింది.
వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం అందించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కలకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆహారం అందించాలని, ఇందుకోసం ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ప్రాంతాల్లో మాత్రమే ఆహారం అందించాలని సూచిస్తూ నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లో కుక్కలకు ఆహారం ఇవ్వకూడదని, ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నియంత్రణ లేకుండా ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పింది. సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయపడింది. వీధి కుక్కల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలు ఫిర్యాదు చేయగలిగేలా హెల్ప్లైన్ నెంబర్ ప్రారంభించాలని ఆదేశించింది.
టీకాలు వేసిన లేదా స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను తిరిగి వాటి ప్రదేశాలలో విడుదల చేయాలని సూచించింది. జంతు ప్రేమికులు డాగ్ షెల్టర్లలోని కుక్కలను దత్తత తీసుకోవచ్చని.. దీనికి ఇందుకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని పేర్కొంది. జంతు జనన నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా కుక్కలను తరలించే మున్సిపల్ అధికారుల చర్యలను ఎవరూ అడ్డుకోవద్దని ధర్మాసనం సూచించింది. ఈనెల 11న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఢిల్లీలో కొత్త డాగ్ షెల్టర్లు, పౌండ్లను ఏర్పాటు చేయాలని కోర్టు మున్సిపల్ సంస్థలను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఎనిమిది వారాల తర్వాత ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.
రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆశ్చర్యం
బిహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డిలీట్ చేసిన ఓటర్ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని కోరింది. అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉండాలని పునరుద్ఘాటించింది. 'డిలీట్ చేసిన పేర్ల విషయంలో ఆధార్ కార్డు లేదా.. ఏదైనా ఆమోదయోగ్య పత్రంతో పాటు చేసే ఆన్లైన్ సబ్మిషన్లను అనుమతిస్తాం.' అని ధర్మాసనం పేర్కొంది. పేర్ల తొలగింపులపై భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వస్తే దరఖాస్తు సమర్పణల తుది గడువును ఎందుకు పొడిగించకూడదని జస్టిస్ కాంత్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
బిహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డిలీట్ చేసిన ఓటర్ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవతో ముందుకు రావాలని కోరింది. అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ ఫ్రెండ్లీగా ఉండాలని పునరుద్ఘాటించింది. 'డిలీట్ చేసిన పేర్ల విషయంలో ఆధార్ కార్డు లేదా.. ఏదైనా ఆమోదయోగ్య పత్రంతో పాటు చేసే ఆన్లైన్ సబ్మిషన్లను అనుమతిస్తాం.' అని ధర్మాసనం పేర్కొంది. పేర్ల తొలగింపులపై భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వస్తే దరఖాస్తు సమర్పణల తుది గడువును ఎందుకు పొడిగించకూడదని జస్టిస్ కాంత్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.