Breakfast Meeting 2.0: నేడు డీకే ఇంట్లో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్..

అనంతరం ఢిల్లీకి వెళ్లే యోచనలో డీకే.శివకుమార్ ?

Update: 2025-12-02 01:45 GMT

కర్ణాటక ప్రభుత్వంలో ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పంచాయితీ సాగుతోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా హైకమాండ్‌తో ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి కర్ణాటకకు షిఫ్ట్ అయింది. కొత్తగా బ్రేక్‌ఫాస్ట్‌ల రాజకీయాలు నడుస్తున్నాయి. గత వారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్‌కు అల్పాహారం ఇచ్చారు. ఇక మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నారు.

అయితే ఈసారి పవర్ షేరింగ్ వివాదానికి ఫుల్‌స్టాప్ పడే సమయం దగ్గర పడినట్లుగా తెలుస్తోంది. డీకే ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం దొరకవచ్చని తెలుస్తోంది. ఈ వివాదం పొడిగించకుండా అధిష్టానం ఏదొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే డీకే.శివకుమార్-సిద్ధరామయ్య మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్య రెండున్నరేళ్ల కాలం పూర్తి కావడంతో.. డీకే వర్గానికి చెందిన వారు పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగతా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని డీకే.శివకుమార్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం బ్రేక్‌ఫాస్ట్ ముగిశాక డీకే.శివకుమార్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి అధిష్టానంతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నవంబర్ 30న సీఎం నివాసంలో జరిగిన తొలి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ తర్వాత కూడా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తామిద్దరం కలిసే ఉన్నామని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న ఊహాగానాల ఒత్తిడి కారణంగానే తాము ఇలా సమావేశం కావాల్సి వస్తోందని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వరుస సమావేశాలు కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి మద్దతుతో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News