Uttar Pradesh: ఐసిస్తో సంబంధాల ఆరోపణలపై 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి అరెస్ట్
ఆన్లైన్లో ఐసిస్ భావజాల ప్రచారం.. రిక్రూట్మెంట్
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్కు చెందిన ఆన్లైన్ మాడ్యూల్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 19 ఏళ్ల దంత వైద్య విద్యార్థిని ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సహరాన్పూర్ జిల్లాకు చెందిన హారిశ్ అలీ అనే ఈ యువకుడిని మొరాదాబాద్లో అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
హారిశ్ అలీ బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, సెషన్, డిస్కార్డ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా ఐసిస్ హ్యాండ్లర్లు, సానుభూతిపరులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారతదేశంలో షరియా ఆధారిత ఖలీఫా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఐసిస్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి, యువతను రిక్రూట్ చేసుకోవడానికి కొందరు ఆన్లైన్ గ్రూపులను నడుపుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
ఈ గ్రూపుల ద్వారా ఉగ్రవాద ప్రచార సామగ్రి, సాహిత్యాన్ని పంచుకుంటున్నట్లు ఏటీఎస్ దర్యాప్తులో తేలింది. ఈ సమాచారం ఆధారంగా లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు.
నిందితుడు మారుపేర్లు, వీపీఎన్లు ఉపయోగించి అనేక గ్రూపులను సృష్టించి, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా "అల్ ఇత్తిహాద్ మీడియా ఫౌండేషన్" అనే ప్రత్యేక గ్రూపును కూడా నడుపుతూ దేశ, విదేశాల్లోని ఐసిస్ నెట్వర్క్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.