Mahua Moitra: కోల్కతా అత్యాచార ఘటన .. సొంత పార్టీ నేతలపై మహువా మొయిత్రా సీరియస్
బాధిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ నేతలు..;
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో లా స్టూడెంట్ పై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతుంది. ఈ క్రమంలో బాధితురాలిదే తప్పంటూ అధికారిక టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడింది. భారత్లోని అన్ని పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించింది. ఇక, మరో పోస్టులో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చింది. ఫిర్యాదు చేసిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొనింది. మహిళలపై జరిగే నేరాలను టీఎంసీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని మొయిత్రా తేల్చి చెప్పింది.
ఇక, ఈ అత్యాచార ఘటనపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థినిపై ఆమె స్నేహితులే అత్యాచారం చేస్తే ఎవరేం చేస్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కాలేజీల్లో ఉంటారా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థిని ఒంటరిగా కాలేజీకి వెళ్లకపోతే.. ఈ ఘటన జరిగేది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో టీఎంసీ పార్టీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.