Union Budget 2024: జులై 22న కేంద్ర బడ్జెట్‌..

జులై 3న ఆర్థిక సర్వే;

Update: 2024-06-15 01:00 GMT

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జూలై 22న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందుకు తీసుకొస్తారని తెలుస్తున్నది.

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక వర్షాకాల సమావేశాలకు కూడా షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుందట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం అయిదు పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1న మోదీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ఈనెల 12న సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు సీతారామన్‌ నేతృత్వంలో ఈనెల 22న ఢిల్లీలో 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుందని జీఎస్టీ కౌన్సిల్‌ గురువారం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది.

ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు.

Tags:    

Similar News