Kolkata Gang Rape Case: కోల్కతా సామూహిక అత్యాచార కేసు.. ప్రధాన నిందితుడి గురించి సంచలన విషయాలు ..
బాధితురాలి శరీరంపై తీవ్ర గాయాలు, పంటిగాట్లు ఉన్నట్టు వైద్య నివేదిక;
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతోనే ప్రధాన నిందితుడు, అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నేత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో మొదట ముగ్గురు నిందితుల (పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్లు)ను అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాకు పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. విద్యార్థినిని సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించిన ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని వేడుకుంటూ ఆ యువతి మోనోజిత్ కాళ్లను పట్టుకున్నా వదలలేదు.
ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా హాకీ స్టిక్తో ఆమెపై దాడి చేశారు. మోనోజిత్ న్యాయవాదిగా పనిచేస్తూ, ఇదే కాలేజీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగానూ ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అయితే, తనకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని మోనోజిత్ కు ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఆమె దేహంపై పలుచోట్ల పంటిగాట్లతో పాటు గాయాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మెడ, ఛాతీపై పంటి గాట్లతో పాటు శరీరంపై నిందితులు గోళ్లతో గీరిన గాయాలు ఉన్నాయి. వివాహం చేసుకోనని ఆమె చెప్పడంతోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
మోనోజిత్ మిశ్రా ఎవరు?
మనోజిత్ లా స్టూడెంట్గా ఉన్నప్పుడు క్యాంపస్ రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయాడు. 2007లో అడ్మిషన్ తీసుకుని, 2012లో గ్రాడ్యుయేట్ కావాల్సి ఉండగా మధ్యలో కోర్సు మానేశాడు. 2017లో మళ్లీ ఐదు సంవత్సరాల బీఏ ఎల్ఎల్బీ కోర్సులో చేరాడు. కాలేజీలో సీట్లు నిండిపోయినప్పటికీ అతడు సీటు సంపాదించడం గమనార్హం.
ఒక పూర్వ విద్యార్థి మాట్లాడుతూ.. “కాలేజీలో 120 సీట్లు ఉండగా మనోజిత్ 121వ అభ్యర్థిగా చేరాడు. కాలేజీలో అందరికీ ఇది తెలిసిన విషయమే, కానీ అతడికి ఉన్న రాజకీయ సంబంధాల వల్ల ఎవ్వరూ ప్రశ్నించలేదు” అని తెలిపాడు. కాగా, 2021లో కాలేజ్ తృణమూల్ యూనిట్ (ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్)లో అతడి తీరు బాగోలేదని తొలగించారు.
మనోజిత్ విద్యార్థి జీవితం, రాజకీయ ప్రస్థానం రెండూ వివాదాస్పదమే. 2017లో మనోజిత్ కొందరితో కలిసి ప్రిన్సిపాల్ కార్యాలయ ధ్వంసానికి పాల్పడటంతో అప్పట్లో తృణమూల్ యూనిట్ రద్దు అయ్యింది. ఆ సమయంలో అతనికి మరో ఇద్దరు నేతలతో గొడవైంది.
క్యాంపస్లో విద్యార్థులు, సిబ్బందిపై అధికారం చెలాయిస్తున్నట్లు ప్రవర్తించేవాడు. అతడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్లలో అతడిపై పలువురు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు. 2022లో గ్రాడ్యుయేట్ పూర్తయి అలీపూర్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2023లో కాలేజ్లో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి, గవర్నింగ్ బాడీ ద్వారా అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నాడు.
మనోజిత్ వ్యక్తిగత జీవితం కూడా బాగోలేదు. మోనోజిత్ మిశ్రా తన తండ్రి రాబిన్ మిశ్రాతో కూడా ఐదు సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నాడు. తల్లి, చెల్లెలు కూడా మోనోజిత్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అతడి నానమ్మ 2023లో మరణించింది. మనోజిత్ కలీఘాట్లో ఉండేవాడు. స్థానికులు అతడిని రౌడీలా చూసేశారు. అతడు తరచూ గొడవలకు దిగేవాడు.