Jewellery Shop: రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కొట్టేసిన మహిళ
ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ లో..
ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గోల్డ్ షాప్ కు వెళ్లిన ఓ జంట అక్కడ చేతివాటం ప్రదర్శించింది. ఆభరణాలు చూసే సమయంలో యజమాని కళ్లుగప్పి రూ.లక్షల విలువైన నెక్లెస్ ను దోచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ జంట స్థానికంగా ఉన్న బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడ కొన్ని ఆభరణాలను చూస్తున్న సమయంలో ఓ నెక్లెస్ను మహిళ ఎవరికీ అనుమానం రాకుండా తన చీర కొంగు కింది భాగంలో దాచేసింది. అనంతరం షాపింగ్ ముగించుకొని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, స్టాక్ తనిఖీల సమయంలో ఆరు గ్రాముల బంగారం తగ్గినట్లు యజమాని గుర్తించాడు. దీంతో దుకాణం యజమాని గౌరవ్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన నెక్లెస్ విలువ దాదాపు రూ.6 లక్షల ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. అందులో ఓ మహిళ నెక్లెస్ను దోచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు వారి కోసం గాలింపు చేపట్టారు. వారిని త్వరలోనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.