మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో మంగళవారం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లా రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి.అబూజ్మడ్ ఇలాకాలోని కోహక్మేట అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. సుమారు గంటన్నరకు పైగా కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.