Chhattisgarh Maoists: ఛత్తీస్ గఢ్ ఇంద్రావతి ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్.
. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో వందలాది మంది మావోలు మృతి చెందారు. వీరిలో అత్యంత కీలకమైన మావో లీడర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది మావోలు లొంగిపోయారు. పలువురు మావోలు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నారు. మరోవైపు, మావోలపై భద్రతాబలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి.
తాజాగా, ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి మృతదేహాలతో పాటు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ... జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. పారిపోయిన మావోల కోసం కూంబింగ్ జరుగుతోందని వెల్లడించారు.