Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక కుట్ర ఉంది -మమత
కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు;
పశ్చిమబెంగాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. ఈ వరదల వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యామ్ల వద్ద డ్రెడ్జింగ్ చేయడంలో విఫలమైందని.. అందువల్లే బెంగాల్లోని పలు జిల్లాల్లో వరదలు సంభవించాయని ఆరోపించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఝార్ఖండ్ -బెంగాల్ సరిహద్దులో మైథాన్, పంచేత్ల వద్ద డీవీసీ డ్యామ్లు ఉండగా.. డీవీసీ ఈ ఏడాది 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడమే తాజా పరిస్థితికి కారణమని ఆమె ఆరోపించారు. గురువారం పశ్చిమ మేదినీపుర్ జిల్లాలోని పష్కురా వద్ద వరద పరిస్థితులను పరిశీలించిన దీదీ.. డీవీసీతో అన్ని సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించారు. వరదలతో నష్టపోయిన వారందరికీ తగిన సహాయ సామగ్రి అందించేలా అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.