ASIA CUP : సూర్యా భాయ్ సారథ్యంలోనే ఆసియా కప్ బరిలోకి..
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్.. జట్టు ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ.. సూర్య కెప్టెన్సీలోనే బరిలోకి టీమిండియా.. స్టార్లకు మళ్లీ భారత జట్టులో చోటు;
ఆసియా కప్ 2025 ఈసారి టీ20 ఫార్మాట్లో యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగనుంది. ఆతిథ్య హక్కులు భారత్ దగ్గరే ఉన్నా.. గతంలో పాకిస్తాన్తో ఒప్పందంలో భాగంగా తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్లు జరుగనున్నాయి. టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగనుండగా.. అబుదాబి, దుబాయ్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం ఉన్నా.. బీసీసీఐ సెలెక్టర్లు జట్టుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025కు ఊహించని స్వ్కాడ్ ఉంటుందని తెలుస్తోంది.ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత జట్టులో కీలక మార్పులు సంభవించబోతున్నాయి. ఈసారి జట్టులో సీనియర్లకు బదులుగా కొత్త యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశముంది. ఈ ఆసియా కప్లో యువ ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది, ఓపెనర్లు గిల్, జైస్వాల్, అభిషేక్ శర్మకు స్థానం ఖాయంగా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో తిలక్, రింకూ సింగ్, సంజు శాంసన్, సాయి సుదర్శన్ ఉండే అవకాశం ఉంది. బౌలింగ్లో బుమ్రా ఫిట్ కాకపోతే, యువ పేసర్లకు ఛాన్స్ దక్కొచ్చు.
సారధిగా సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఈ ఆసియా కప్లో భారత జట్టుకు సూర్య భాయ్ నాయకత్వం వహించనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న సూర్యా.. జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకున్నాడు. అయితే సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగబోయే ఆసియా కప్ ప్రారంభానికి ముందు పూర్తిగా ఫిట్ గా ఉంటాడా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 3వ వారంలో భారత జట్టును ప్రకటించనుంది. ఐపీఎల్ 2025లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్స్ శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జీటీ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా ఆసియా కప్ 2025కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలానే ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరిగిరానున్న స్టార్లు
మొన్నటివరకు విశ్రాంతి తీసుకున్న స్టార్ ఆటగాళ్లు ఈసారి మళ్లీ జట్టులో కలవనున్నారు. ఇప్పుడు కీలక టోర్నీ కావడంతో టాప్ ఆటగాళ్లను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టాప్ జట్టును ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే గిల్, యశస్వి , శ్రేయాస్, కృనాల్ జట్టులోకి రానున్నారు. సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్గా ఉంటాడని తెలుస్తోంది. గాయం కారణంగా రిషభ్ పంత్ ఎంపికయ్యే అవకాశాలు లేవు. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్ పరీక్షలు పాసవ్వాలి.
భారత జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్, కృనాల్ పాండ్యా.