DHONI: క్రికెట్‌లో మహేంద్ర జాలకుడు ధోనీ

నేడు మహేంద్రసింగ్ ధోనీ జన్మదినం... కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యంకాని ఘనతలు సాధించిన మహీ;

Update: 2024-07-07 03:00 GMT

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ 43వ బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ధోనీ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను లిఖించాడు. ముఖ్యంగా నాయకుడిగా ప్రపంచంలో ఏ కెప్టెన్‌కు దక్కిన విజయాలు సాధించాడు. ఈ 1981 జులై 7న జన్మించిన మహేంద్రుడి 43వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఓసారి మిస్టర్ కూల్‌ విశేషాలు చూద్దామా...


అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ధోని 17,266 పరుగులు చేశాడు. ధోని 90 టెస్టుల్లో 4, 876 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ధోని నిలిచాడు. 350 వన్డేలు ఆడిన ధోనీ... 10,773 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోనీ 10 శతకాలు చేశాడు. 98 టీ 20ల్లో 1617 పరుగులు చేశాడు. 2019 వరల్డ్ కప్‌ సెమీస్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ రనౌట్‌... భారత్‌ అభిమానులను తీవ్ర వేదనకు గురిచేసింది. అప్పుడే ధోనీ శకం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రపంచకప్‌ తర్వాత సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

2004 డిసెంబర్‌ 23 బంగ్లాదేశ్‌తో జరిగిన భారత జట్టులోకి విధ్వంసకర బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ... ఆ తర్వాత ఫినిషర్‌గా... అనంతరం కెప్టెన్‌గా భారత క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. విశాఖపట్నం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ ధోనీ జీవితంతోపాటు.. భారత క్రికెట్‌ ప్రయాణానికి అతిపెద్ద టర్నింగ్‌ పాయింట్‌. జులపాల జుట్టుతో విశాఖ తీరంలో ఉప్పెనలా విరుచుకుపడ్డ ధోనీ... పాకిస్థాన్‌ బౌలర్లను ఉతికి ఆరేసి తన రాకను బలంగా చాటాడు. ఆ మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులు చేసిన మహేంద్రుడు...అదే సంవత్సరం లంకతో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


మైదానంలో ధోనీ కెప్టెన్సీ లక్షణాలు గమనించిన సచిన్‌ 2007 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోనీని టీ 20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా చేయాలని సూచించాడు. సెహ్వాగ్‌, హర్భజన్‌, యువరాజ్‌ ఉన్నా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహీ... భారత జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. అప్పటినుంచి భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలు మారిపోయాయి. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ధోనీ పేరు మార్మోగిపోయింది. 2011లో ధోనీ కెప్టెన్సీలో 28 ఏళ్ల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్‌ గెలుచుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్‌.... క్రికెట్‌ ప్రేమికుల మనసులపై ఒక చెరగని సంతకం. ధోనీని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (2007), పద్మశ్రీ (2009), పద్మభూషణ్ (2018) లతో సత్కరించింది.

Tags:    

Similar News