Champions Trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ..మధ్యాహ్నం 2.30కు తొలి మ్యాచ్

తలపడనున్న పాకిస్థాన్, న్యూజిలాండ్‌..;

Update: 2025-02-19 05:15 GMT

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. అయితే, 2017లో రద్దై.. మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పొందనున్న టోర్నీకి పాకిస్థాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ టోర్నీలో తలపడుతున్నప్పటికి వెస్టిండీస్, శ్రీలంక జట్లు టోర్నీకి కనీసం అర్హత కూడా సాధించలేకపోయాయి.

అయితే, 1996లో వన్డే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్‌.. మళ్లీ ఇప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీకి సారథ్యం వహిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్‌.. ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తుంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఆ టీమ్.. టోర్నమెంట్లో శుభారంభం చేయాలని భావిస్తుంది. కానీ, తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతోంది. కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కివీస్‌.. పాక్‌ను లీగ్‌తో పాటు ఫైనల్లోనూ మట్టికరిపించింది.

కాగా, ఈ టోర్నమెంట్లో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్‌ జరగనుంది. భారత్‌ ఆడే 3 లీగ్‌ మ్యాచ్‌లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్‌ వేదికగా జరగనున్నాయి. టీమిండియా తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడబోతుంది. ఇక, భారత్ సెమీస్ కి, ఆపై ఫైనల్‌ చేరితే ఆ రెండు మ్యాచ్‌లూ కూడా దుబాయ్‌లోనే జరుగుతాయని ఐసీసీ తెలిపింది. మరో సెమీ ఫైనల్‌కు మాత్రం పాక్‌ ఆతిథ్యం ఇస్తుంది. భారత్‌ ఫైనల్‌ చేరకపోతే మాత్రం టైటిల్‌ పోరును పాకిస్తాన్‌లోనే నిర్వహిస్తారు.

Tags:    

Similar News