IND vs eng:భారత్ భారీ స్కోరు.. ధీటుగా స్పందిస్తున్న ఇంగ్లాండ్
రిషభ్ పంత్ అద్భుత శతకం.. 471 పరుగుల భారత్ ఆలౌట్.. ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 209/3;
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు చేయగా... ఇంగ్లాండ్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. 359/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్.. మరో 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను ముగించింది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో సునాయసంగా 500కుపైగా పరుగులు చేసేలా కనిపించిన టీమ్ఇండియా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. 127 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (147; 227 బంతుల్లో) వద్ద ఔటయ్యాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ (134; 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్లు) శతకంతో విరుచుకుపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టి చాలా కాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) నిరాశపర్చారు. తొలి రోజే యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) శతకం, కేఎల్ రాహుల్ (42) చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కరుణ్ నాయర్.. దేశవాళీల్లోలాగే అంతర్జాతీయ మ్యాచుల్లోనూ ఇరగదీస్తాడని అంతా అనుకున్నారు. పెద్దగా ఒత్తిడి లేదు కాబట్టి వేగంగా పరుగులు చేస్తే బాగుంటుందని భావించారు. కానీ నాయర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. ఎదుర్కొన్న ఐదో బంతికే బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పంత్ 7వ టెస్టు సెంచరీ.. ధోనీ రికార్డు బద్దలు
ఈ మ్యాచ్లో కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డపై మరోసారి చెలరేగాడు. తన ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 134 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్లో పంత్కు ఇది మూడో సెంచరీ. ఇంతకుముందు 2018, 2021లో 100 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తాజా సెంచరీతో పంత్ దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. పంత్కు ఇది 7వ టెస్టు సెంచరీ. టెస్టుల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డుకెక్కాడు. ఇంతకుముందు ఆరు సెంచరీలతో ధోనీతో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును కలిగి ఉన్నాడు. తాజాగా ధోనీని వెనక్కినెట్టాడు. మొత్తంగా అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ 8వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ 17 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రోజు కూడా ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును పంత్ బద్దలుకొట్టాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ భారత వికెట్ కీపర్గా పంత్ ఘనత సాధించాడు.
ధీటుగా స్పందిస్తున్న ఇంగ్లాండ్
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేయగా... బ్రిటీష్ జట్టు కూడా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 125 బంతుల్లోనే శతకం చేసిన ఓలి పోప్ ఇంగ్లాండ్ను పోటీలో నిలిపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 262 పరుగుల వెనుకంజలో ఉంది. బెన్ డకెట్ 94 బంతుల్లో 62 పరుగులు చేసి రాణించాడు. డకెట్ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచులో బుమ్రా 3 వికెట్లు తీయగా ఈ మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ఈ టెస్టులో మూడో రోజు ఆట చాలా కీలకంగా మారనుంది.