ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. మోదీ తన బీహార్ పర్యటనలో భాగంగా పాట్నాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టులో మోదీ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. 14 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు వైభవ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీమిండియాకు ఆడి దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కలగా ముందుకు సాగుతున్న వైభవ్ను ప్రధాని మోదీ అభినందించారు.
స్వయంగా పోస్ట్ చేసిన మోదీ
యంగ్ క్రికెటింగ్ సెన్సెషన్ అంటూ వైభవ్ను ప్రశంసించారు. అలాగే వైభవ్తో కలిసి ఫొటోలను కూడా ప్రధాని మోదీ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం విశేషం. “పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవన్షీ, అతని కుటుంబ సభ్యులను కలిశాను. అతని క్రికెట్ నైపుణ్యాలను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు! అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వైభవ్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సూర్యవన్షీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కేవలం ఏడు మ్యాచ్ల్లోనే ఈ టీనేజర్ 252 పరుగులు చేశాడు. ఇటీవల మన్కీ బాత్లో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సాధించిన అద్భుతాల గురించి ప్రధాని మోదీ ప్రశంసించారు. “ఐపీఎల్లో బిహార్ బిడ్డ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరును చూశా. అంత చిన్న వయసులో అతడు గొప్ప రికార్డును సృష్టించాడు. ఈ ప్రదర్శన వెనుక అతడి కఠోర శ్రమ ఉంది,” అని మోదీ కొనియాడారు.
ఐపీఎల్లో విధ్వంసం
వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున డెబ్యూ చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో సెంచరీ బాదిన క్రికెటర్గా, అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డులు నెలకొల్పాడు. ఈ సీజన్లో 7 మ్యాచుల్లోనే 252 పరుగులు చేసి ఔరా అనిపించాడు.