గత కొన్ని నెలలుగా భారత క్రికెట్ జట్టును గాయాలు దెబ్బకొడుతున్నాయి. ఫాంలో ఉన్న కీలక ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులో పలు కీలక స్థానాల్లో వారి లోటు కన్పించిందగి. వీరిద్దరే కాకుండా భారత బౌలింగ్ టీంకు వెన్నెముకలా ఉన్న ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడటం లేదు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్లో ఆడిన బుమ్రా, గాయంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా బరిలో దిగలేదు. వెన్నెముక నొప్పితో మార్చి నెలలో సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత నుంచి బెంగళూర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతను లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. సిరాజ్, శార్ధూల్ లాంటి పేసర్లు ఉన్నా, కీలక సమయంలో వికెట్లు తీస్తూ, యార్కర్లు వేయగల నైపుణ్యం గల బుమ్రా లేకపోవడంతో కొన్ని మ్యాచులు కోల్పోవాల్సి వస్తోంది.
అయితే బుమ్రా మరి కొద్దిరోజుల్లోనే జట్టుతో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. నెట్లో బుమ్రా సాధన చేస్తున్న వీడియో ఒకటి విడుదలైంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా బుమ్రా నెట్లో సాధన చేస్తూ కనిపించాడు. రోజుకు 8 నుంచి 10 ఓవర్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో బుమ్రా గాయం కోలుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఆగస్ట్లో ఐర్లాండ్ క్రికెట్ టీంతో జరిగే టీ20 సిరీస్లో బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయి.
బుమ్రా 2022 జులైలో ఇంగ్లాండ్తో చివరి సారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వచ్చే వరల్డ్ కప్కి కూడా సిద్ధంగా ఉండే అవకాశాలున్నాయి.
విండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్లో భారత్ గెలిచింది. అయితే బౌలింగ్ దళంలో బుమ్రా లేని లోటుందని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. గాయంతో బాధపడుతున్న మరో బౌలర్ ప్రసీధ్ క్రిష్ణ కూడా గాయం నుంచి కోలుకుని, బౌలింగ్ ప్రాక్టిస్ చేస్తున్నాడు.