Padikkal: సత్తా చాటిన దేవదత్ పడిక్కల్
విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ చేరిన కర్ణాటక, మహారాష్ట్ర;
విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో కర్ణాటక తరపున ఆడిన దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో తన జట్టులను సెమీస్ చేర్చాడు. బరోడాతో జరిగిన కీలక పోరులో పడిక్కల్ కేవలం 99 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతమైన 102 పరుగులు చేశాడు.మ్యాచ్ ప్రారంభంలోనే మయాంక్ అగర్వాల్ ఔటవడంతో కర్ణాటక తొలుత ఒత్తిడిలో పడినా, పడిక్కల్-అనీష్ కెవి జోడీ 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అనీష్ కెవి 52 పరుగులు చేసి ఔటైనా, పడిక్కల్ తన ఇన్నింగ్స్ను మరింత పటిష్ఠంగా కొనసాగించాడు. పడిక్కల్ శతకం... అతని IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భరోసా కలిగించింది. 2025 IPL వేలంలో RCB అతడిని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
సెమీస్ చేసిన కర్ణాటక, మహారాష్ట్ర
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, కర్ణాటక సెమీస్లో అడుగుపెట్టాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో పంజాబ్పై 70 పరుగుల తేడాతో మహారాష్ట్ర భారీ విజయం సాధించింది. అర్షిన్ కులకర్ణి(107) సెంచరీ, అంకిత్(60), నిఖిల్(52 నాటౌట్) రాణించారు. మహారాష్ట్ర 275/6 స్కోరు చేయగా.. పంజాబ్ 205 పరుగులకే ఆలౌటైంది. మరో మ్యాచులో కర్ణాటక 5 పరుగుల తేడాతో బరోడాను ఓడించింది. కర్ణాటక 281 రన్స్ చేయగా.. బరోడా 276 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్, హర్యానా మధ్య, విదర్భ, రాజస్థాన్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచులలో విజయం సాధించిన జట్లు సెమీస్ లో అడుగు పెడతాయి.
ఓకే ఓవర్లో ఆరు ఫోర్లు
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ అదరగొట్టాడు. రాజస్థాన్తో జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్లో జగదీశన్ ఈ ఫీట్ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్గా వేశాడు. షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి.