MESSI: రాజకీయ నేతల కోసం మెస్సీను తెచ్చారా..?
కోల్కత్తా అభిమానుల తీవ్ర ఆగ్రహం... సాల్ట్లేక్ మైదానంలో గందరగోళం... ముందుగానే మైదానం వీడిన మెస్సీ... మెస్సీని చూడలేకపోయిన ఫ్యాన్స్
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని దగ్గర నుంచి చూద్దామని వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోల్కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తమ అభిమాన ఆటగాడు మైదానంలో కేవలం పది నిమిషాల లోపే కనిపించి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్ల కోసం రూ. 5,000 నుంచి రూ. 12,000 వరకు చెల్లించి, గంటల తరబడి ఎదురుచూసిన అభిమానులు.. మెస్సీ కాసేపటికే మైదానం వీడటంతో సహనం కోల్పోయారు. నిరసనగా స్టేడియంలోని స్టాండ్స్లో ఆందోళనకు దిగారు. కొందరు బాటిళ్లు విసరగా, మరికొందరు హోర్డింగులను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది.
ఈ ఘటనపై ఓ అభిమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఁనాయకులు, నటులు మాత్రమే మెస్సీ చుట్టూ ఉన్నారు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? రూ.12,000 పెట్టి టికెట్ కొన్నాం, కానీ అతని ముఖం కూడా సరిగా చూడలేకపోయాంఁ అని వాపోయాడు. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని, ఇది మోసం చేయడమేనని పలువురు ఆరోపించారు.అంతకుముందు, మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా కోల్కతాకు చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్తో కలిసి ఆయన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు.
అయితే, స్టేడియంలో జరిగిన గందరగోళం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీతో జరగాల్సిన సమావేశాలను మెస్సీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని, తన పర్యటనలో తదుపరి నగరమైన హైదరాబాద్కు బయలుదేరారు. కాగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మెస్సికి, అతడి అభిమానులకు క్షమాపణ చెప్పారు. స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి.. షాక్ అయినట్లు చెప్పారు. మెస్సిని చూసేందుకు తాను కూడా బయలుదేరానని.. కానీ అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుని వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ది గోట్ టూర్లో భాగంగా మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చాడు. శనివారం తెల్లవారు జామున కోల్కతాలో ల్యాండ్ అయ్యాడు. షెడ్యూల్ ప్రకారం అతడు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో అతడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.మెస్సిని దగ్గరి నుంచి చూడాలని.. ఆటను వీక్షించాలని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అయితే మెస్సి మాత్రం.. మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. అలా వచ్చి.. ఇలా మైదానం వీడాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మెస్సి కోసం వస్తే.. పది నిమిషాలు కూడా లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.