IPL: ఐపీఎల్లో రబాడ కలకలం
ఐపీఎల్ నుంచి వైదొలిగిన రబాడ... స్వదేశానికి వెళ్లిపోయినట్లు ప్రచారం;
గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బౌలర్ కగిసో రబాడా IPL నుంచి వైదొలిగినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సౌతాఫ్రికా పేసర్ స్వదేశం వెళ్లిపోయాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలపై గుజరాత్ జట్టు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడిన రబాడు రెండు వికెట్లు తీశారు.
బీసీసీఐ వ్యాఖ్యల వల్లేనా..?
బెంగళూరుతో జరిగిన గత మ్యాచులో రబాడను గుజరాత్ జట్టు టీమ్లోకి తీసుకోలేదు. దీనికి ఆ జట్టు సారథి శుబ్మన్ గిల్ చెప్పిన కారణం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల రబాడను ఆడించడం లేదని అన్నాడు. దీంతో లేనిపోని సందేహాలు తలెత్తుతున్నాయి. టోర్నీలో ఆడదామని వచ్చిన ప్లేయర్ బరిలోకి దిగకపోవడానికి పర్సనల్ రీజన్స్ ఏం ఉంటాయా.. అని అంతా ఆలోచనల్లో పడ్డారు. గుజరాత్-ముంబై మధ్య జరిగిన గత మ్యాచ్లో రబాడ ఆడాడు. అతడు ఫుల్ ఫిట్గా కనిపించాడు. గాయాలేమీ లేవు, పర్సనల్ రీజన్స్ వల్లే ఆడట్లేదని గిల్ అన్నాడు. దీంతో అతడ్ని కావాలనే తప్పించారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అసలు రబాడ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ ఆరంభంలో దాదాపుగా ఆరేడు మ్యాచుల్లో అన్ని జట్లు 200 ప్లస్ స్కోర్లను బాదాయి. దీనిపై రబాడ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్లు మరీ ఫ్లాట్గా ఉన్నాయని.. ఇది క్రికెట్ కాదు, బ్యాటర్ల గేమ్గా అనిపిస్తోందన్నాడు. బ్యాట్-బాల్కు మధ్య బ్యాలెన్స్ లేనప్పుడు గేమ్ ఇలాగే ఉంటుందని, ఇలాగేనా మ్యాచులు నిర్వహించేది అంటూ ఇన్డైరెక్ట్గా ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐపై సీరియస్ అయ్యాడు రబాడ. దీంతో ఆ తర్వాత నుంచి పిచ్లు మారడం, 200 లోపే స్కోర్లు నమోదవడాన్ని గమనించొచ్చు. ఈ క్రమంలోనే తమపై సీరియస్ అయిన రబాడను టీమ్లోకి తీసుకోవద్దని జీటీ మేనేజ్మెంట్కు బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. అందుకే నిన్న ఆర్సీబీతో పోరులో అతడ్ని ఆడించలేదని టాక్. ఇది తెలిసిన నెటిజన్స్.. ప్రశ్నించడం కూడా పాపమేనా.. ఏం తప్పు చేశాడని రబాడను వేధిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.