IPL: మ్యాచ్ను మలుపు తిప్పిన క్యాచ్
అద్భుత క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పిన రియాన్ పరాగ్;
చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్టన్నింగ్ క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. హసరంగా బౌలింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివమ్ దూబే ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను పరాగ్ అద్భుతంగా అందుకున్నాడు. అప్పటికే వరుసగా రెండు బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న శివమ్ దూబే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది. లేకపోతే ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచులో రాజస్థాన్ స్పిన్నర్ హసరంగా (4/35).. చెన్నైని కోలుకోని విధంగా దెబ్బతీశాడు.
మ్యాచ్ మలుపు తిరిగింది అక్కడే
రాజస్థాన్, చెన్నై మ్యాచ్లో చివరి 2 ఓవర్లలో చెన్నై విజయానికి 39 పరుగులు కావాల్సి ఉంది. 19వ ఓవర్లో ధోని ఓ బౌండరీతో పాటు భారీ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి జడేజా సిక్స్ కొట్టాడు. దీంతో ఆఖరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ధోని ఔటవ్వడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. చివరి రెండు బంతులను కట్టడిగా బౌలింగ్ చేసి RRకి విజయాన్ని అందించాడు.
గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్
రాజస్థాన్ చేతితో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫీల్డింగ్ తప్పిదాలు, ఓపెనర్ల వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీశాయన్నాడు. రాజస్థాన్ బ్యాటర్ నితీష్ రాణా అద్భుత బ్యాటింగ్ చేశాడన్న రుతురాజ్.. తమ ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తేనే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. 183 పరుగుల లక్ష్యం చేధించదగినదేనని, గెలిచే మ్యాచ్లో ఓడటం బాధ కలిగించిందన్నాడు. తమ బౌలింగ్ విభాగంలో మూమెంటమ్ అవసరమని తెలిపాడు.
ఛేజింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డు
ఐపీఎల్లో CSK చెత్త రికార్డులు మూటగట్టుకుంటోంది. 2019 నుంచి ఆ జట్టు 180పైగా టార్గెట్ను ఛేదించలేదు. ఇప్పటివరకు 9సార్లు ఛేజింగ్కు దిగగా అన్నిట్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. మరే ఇతర జట్టు ఛేజింగ్లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోలేదు. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్గా CSK 180పైగా ఛేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగి 15 సార్లు గెలిచింది. ఇందులో సురేశ్ రైనా ఆడిన 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
ద్రవిడ్ గాయంపై ధోనీ ఆరా
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తోన్న రాహుల్ ద్రవిడ్ ఎడమ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. నిన్న RR చేతిలో CSK ఓటమి తర్వాత ద్రవిడ్ దగ్గరకు ధోని వెళ్లాడు. ద్రవిడ్ గాయంపై ధోనీ ఆరా తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతాయి. ఇద్దరు దిగ్గజాలు కలిశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.