SACHIN: దంతేవాడలో సచిన్ ఆధ్వర్యంలో 50 మైదానాలు

దండకారణ్యంలో క్రీడా మైదానాలు.. క్రికెట్ గాడ్ నేతృత్వంలో అంకురార్పణ;

Update: 2025-06-10 05:00 GMT

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ... ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. ఈ దండకారణ్యం ఎప్పుడూ తూపాకీ శబ్దాలతో.. బాంబు పేలుళ్లతో.. ఆర్త నాదాలతో దద్దరిల్లిపోతుంటోంది. మావోయిస్టుల అడ్డాగా ఉన్న ఈ అభయారణ్యం.. ఇప్పుడు శాంతి దిశగా పయనిస్తోంది. దంతేవాడలోని కీలక ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం... మావోలు లొంగిపోవడం... లేక ఎన్ కౌంటర్ లో మరణించడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు దంతేవాడలోని యువతను.. పిల్లలను మావో బాట పట్టకుండా ఉండేందుకు కేంద్రం క్రీడలను అస్త్రంగా చేసుకోనుంది. క్రికెట్ గాడ్ సచిన్ ఆధ్వర్యంలో 50 మైదానాలు సిద్ధమవుతున్నాయి.

క్రికెట్ గాడ్ నేతృత్వంలో....

నక్సలిజంతో ప్రభావితమైన దంతేవాడ జిల్లా... ఇప్పుడు క్రీడల వైపు చూస్తోంది. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో దంతేవాడ జిల్లాలో 50 మైదానాలను నిర్మిస్తున్నారు. ఎప్పుడూ బాంబుల శబ్దాలు, తుపాకీ మోతలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు పిల్లల నవ్వులు, ఆటలు, వ్యాయామాల మార్పు కనిపించనుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాన్ దేశి ఫౌండేషన్‌తో కలిసి బస్తర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మైదానాలు కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, గ్రామీణ యువతకు శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు గ్రామస్తులే స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బయట కాంట్రాక్టర్లను పిలవకుండా, గ్రామ ప్రజలే మైదానాలు తయారు చేసుకుంటున్నారు. ‘ప్రతి మైదానం ఒక మార్పుకు చిహ్నం’ అని ఫౌండేషన్ ప్రతినిధి దివ్య సింహా తెలిపారు. ఇవి గిరిజన సమాజాన్ని ప్రేరేపించడమే కాదు, పిల్లలకు కలలు కనే శక్తిని ఇస్తున్నాయన్నారు.

చీకట్లను చీలుస్తూ..

దంతేవాడలో నక్సలిజం చీకట్లను ఈ క్రీడలతో చీల్చేయాలని చూస్తున్నారు. సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నాడు. రక్తంతో తడిసి ముద్దయిన దంతేవాడలో.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శాంతిని వెల్లివిరిసేలా చేయాలని ప్రణాళిక రచిస్తున్నాడు. దశాబ్దాలుగా కలలు కనేందుకు భయపడిపోయిన గిరిజన గ్రామాల్లో... ఈ క్రీడా మైదానాలతో పెను మార్పులు రావడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు. దంతేవాడలో ఒక గ్రామం తర్వాత మరొక గ్రామంలో వెదురు గోల్‌పోస్టులు నిర్మిస్తున్నారు. "50 గ్రామాల ప్రజలు క్రీడా మైదానాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిన్న మైదానాల్లో పెద్ద ఆటగాళ్లు రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ మైదానాల నిర్మాణానికి మా ఫౌండేషన్-ప్రభుత్వం సహాయం చేస్తుంది" అని మన్ దేశి ఫౌండేషన్‌కు చెందిన దివ్య సిన్హా చింద్నార్ వెల్లడించారు.

నైతిక విలువలు క్రమశిక్షణ కోసం

క్రీడలు పిల్లలలో నైతిక విలువలు, క్రమశిక్షణను పెంపొందిస్తాయని సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకున్నానో వారూ కూడా క్రీడల ద్వారా కొత్త ఆశను నింపుకొని ముందుకు సాగాలి. ఈ మార్పు వల్ల మారుమూల గ్రామాల్లో కొత్త తరం నూతన ఆశతో జీవించడం మొదలుపెడతారని సచిన్ అన్నారు. దంతెవాడ, బస్తర్ ప్రాంతం పూర్తిగా నక్సలిజంతో ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉంది. ఇప్పుడు ఇలా క్రీడా మైదానాల డెవలప్ మెంట్ తో అక్కడి పిల్లల్లో శారీరక, మానసిక మార్పు రావడం ఖాయం. దీంతో పాటు వారు చదువుల్లో రాణిస్తే ఇక వారి మెరుగైన భవిష్యత్తుకు తిరుగుండదు. అయితే గిరిజనులు కూడా తమ పిల్లలను క్రీడల్లో శిక్షణ ఇప్పించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తమ బతుకుల్లో ఈ మైదానాలు వెలుగు నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News