GAVASKAR: శుభ్మన్ గిల్కు గవాస్కర్ వార్నింగ్
అందరితో కలిసిపోవాలని సూచించిన దిగ్గజం;
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది. సుదీర్ఘ ఫార్మట్లో గిల్కు తొలి సవాల్ ఎదురుకానుంది. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. అయితే సొంతగడ్డపై ఇంగ్లాండ్ను ఓడించడం అంత సులువు కాదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్లో ఆడిన అనుభవం లేదు. దీంతో గిల్ కెప్టెన్గా తన మొదటి ఎసైన్మెంట్లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
భారత కెప్టెన్గా ఎంపికైన ఆటగాడిపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అన్నాడు. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నాడు. ఎందుకంటే టీమ్ మెంబర్గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారని... కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలని గవాస్కర్ అన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్సీపై గిల్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో ఎలా ఆడాలి.. సిరీస్లు ఎలా గెలవాలో చూపించారు. వీరి స్ఫూర్తితోనే ముందుకు సాగుతా’’ అని అన్నాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. దీనికి గిల్ సారథిగా ఎంపిక కాగా.. మరో యువ ఆటగాడు రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.