IND vs SL: టీమిండియా ఘోర పరాజయం.. తొలిసారి పొట్టి సిరీస్ లంక వశం
IND vs SL: భారత్తో జరిగిన మూడో టీ-20లో ఆతిథ్య దేశం శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.;
India Vs Srilanka 3rd T20: భారత్తో జరిగిన మూడో టీ-20లో ఆతిథ్య దేశం శ్రీలంక... ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో శ్రీలంక సునాయాస విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. వరుస సిరీస్ ఓటములతో సతమతమవుతున్న శ్రీలంక జట్టులో నూతనోత్సాహం నెలకొంది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక... 3 వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ధనంజయ డిసిల్వ 23 పరుగులు, వానిండు హసరంగ 14 పరుగులు చేశారు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవిష్క ఫెర్నాండో , మినోద్ భానుక , సమర విక్రమను రాహుల్ చాహర్ ఔట్ చేశాడు.
ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసి..రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 2008లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాపై అత్యల్ప టీ-20 స్కోర్ 74 పరుగులుగా నమోదైంది. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో ఆఖరివరకు క్రీజ్లో ఉండగా...భువనేశ్వర్ కుమార్ 16 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లు వానిండు హసరంగ 4 నాలుగు వికెట్లు, డాసున్ శనక రెండు వికెట్లు తీశారు.
కాగా, టీమ్ఇండియాను శ్రీలంక ఆది నుంచే కట్టడి చేసింది. తొలి ఓవర్లో కెప్టెన్ ధావన్ డకౌట్ చేసి ఇతర ఆటగాళ్లకు హెచ్చరికలు పంపింది. ఈ క్రమంలోనే నాలుగు, ఐదు ఓవర్లలో దేవ్దత్ పడిక్కల్ 9 పరుగుల వద్ద, సంజూ శాంసన్ డకౌట్ కాగా... రుతురాజ్ గైక్వాడ్ 14 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత నితీశ్ రాణా 6 పరుగులకే వికెట్ కోల్పోవటంతో..భారత్ 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీ-20లో అత్యల్ప స్కోర్ నమోదు చేసేలా కనిపించింది.
అయితే భువనేశ్వర్, కుల్దీప్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఆరో వికెట్కు 19 పరుగులు జోడించారు. చివరికి భువనేశ్వర్ 15వ ఓవర్లో ఔటయ్యాక.. టెయిలెండర్లతో కలిసి కుల్దీప్ జట్టు స్కోర్ను 81 పరుగులకు చేరవేశాడు. దాంతో భారత్కు టీ20ల్లో మరో అత్యల్ప స్కోర్ నమోదు కాకుండా చూశాడు. కాగా, శ్రీలంక ఆటగాడు వానిండు హసరంగ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.