IPL: గుజరాత్ ఓపెనర్ల ఊచకోత

ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఒక్క వికెట్ నష్టపోకుండా 200 పరుగుల లక్ష్య ఛేదన;

Update: 2025-05-19 02:00 GMT

ఐపీఎల్‌ 2025లో గుజరాత్ టైటాన్స్‌ జోరు కొనసాగుతోంది. భారీ స్కోరు నమోదైన మ్యాచులో ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్‌... ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఢిల్లీ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని... గుజరాత్‌ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించి ప్లే ఆఫ్‌కు చేరింది. ఈ గెలుపుతో 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. గుజరాత్‌తో పాటు పంజాబ్ కింగ్స్ 17 పాయింట్లతో, ఆర్సీబీ 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ శతకంతో చెలరేగాడు. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలోనే ఒక్క వికెట్టూ కోల్పోకుండా సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ శతకంతో చెలరేగగా... శుభమన్‌ గిల్ 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్‌ ఘన విజయం సాధించింది.

రాహుల్ శతకం..

ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. కె. ఎల్. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులు చేసి అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో 2 సెంచరీలు చేసిన కెఎల్ రాహుల్‌కి ఇది ఐదో ఐపీఎల్‌ సెంచరీ. . విరాట్ కోహ్లీ 8 ఐపీఎల్ సెంచరీలతో, జోస్ బట్లర్ 7, క్రిస్ గేల్ 6 ఐపీఎల్ సెంచరీలతో రాహుల్ కంటే ముందున్నారు. 7 టీ20 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు కె. ఎల్. రాహుల్. విరాట్ కోహ్లీ 9 టీ20 సెంచరీలతో, రోహిత్ శర్మ 8 టీ20 సెంచరీలతో రాహుల్ కంటే ముందున్నారు. 7 టీ20 సెంచరీలు చేసిన అభిషేక్ శర్మ రికార్డును కె. ఎల్. రాహుల్ సమం చేశాడు.. టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు కె. ఎల్. రాహుల్. విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా కె.ఎల్. రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం..ఐపీఎల్ 2025 సీజన్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న మొట్టమొదటి కుడి చేతి వాటం బ్యాటర్ కె. ఎల్. రాహుల్. ఇప్పటిదాకా ప్రియాన్ష్ ఆర్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కావడం విశేషం.

చితక్కొట్టిన గిల్‌, సుదర్శన్

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఛేజింగ్ లో గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మ‌న్ గిల్‌, సాయి సుదర్శన్ అదరగొట్టారు. బౌండరీల మోత మోగిస్తూ ఈ జంట పరుగులు రాబట్టింది. ఢిల్లీ బౌలర్లను చితకబాదింది. సాయి, గిల్ కచ్చితమైన టైమింగ్ తో షాట్లు కొట్టారు. సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్‌మ‌న్ గిల్‌ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అమేజింగ్ బ్యాటింగ్ తో గుజరాత్ ను గెలిపించారు. 200 రన్స్ ఛేజింగ్ లో జీటీ ఒక్క వికెట్టూ కోల్పోకుండా 19 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. ఈ విక్టరీతో జీటీ (18 పాయింట్లు), ఆర్సీబీ (17), పంజాబ్ కింగ్స్ (17) ప్లేఆఫ్స్ చేరాయి. ఇక మిగిలిన ఒక్క బెర్తు కోసం ఎంఐ, డీసీ, ఎల్ఎస్జీ పోటీపడతాయి. ప్రత్యర్థి హోం గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా సాయి సుదర్శన్, శుభ్‌మ‌న్ గిల్‌ బ్యాటింగ్ కొనసాగించారు. వికెట్ ఇవ్వకూడదనే పట్టుదల ప్రదర్శించారు. నటరాజన్ ఓవర్లో సాయి వరుసగా 6, 4, 4 దంచాడు. అదే ఓవర్లో మరో ఫోర్ కొట్టాడు. ఆరంభంలో గిల్ కాస్త నెమ్మదిగా ఆడాడు. పవర్ ప్లేలో జీటీ 59 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ విజయ సమీకరణం 24 బంతుల్లో 35 పరుగులుగా మారింది. కానీ వెంటనే నటరాజన్ వేసిన 17వ ఓవర్లో సుదర్శన్ ఫోర్.. గిల్ వరుసగా 4, 6 కొట్టాడు. ఆ ఓవర్లో 18 రన్స్ రావడంతో సమీకరణం 18 బంతుల్లో 17 పరుగులుగా మారింది. ఆ తర్వాత కుల్ దీప్ బౌలింగ్ లో సిక్సర్ తో సాయి సుదర్శన్ సెంచరీ చేరుకున్నాడు. తర్వాతి ఓవర్లో సిక్సర్ తో సుదర్శన్ మ్యాచ్ ముగించాడు.

Tags:    

Similar News