ipl: ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి సన్రైజర్స్ అవుట్..!
గుజరాత్ చేతిలో ఘోర పరాజయం;
ఐపీఎల్ 18వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలకు దాదాపు తెరపడింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్... గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 224 పరుగులు చేసింది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 186 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లు రాణించారు. శుభ్మన్ గిల్ (76: 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు), జోస్ బట్లర్ (64: 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), సాయి సుదర్శన్ (48: 23 బంతుల్లో 9 ఫోర్లు) చెలరేగడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3, కమిన్స్, అన్సారీ తలో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితం అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (74: 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగినా, మిగతావారు విఫలం కావడంతో ఆజట్టు గెలుపు తీరాలకు చేరలేకపోయింది. క్లాసెన్ (23: 18 బంతుల్లో 1 ఫోర్లు, ఒక సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (21*: 10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్లు), ప్యాట్ కమిన్స్ (19*: 10 బంతుల్లో 1 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ 2, ఇషాంత్ శర్మ, కొయిట్జీ తలో వికెట్ తీశారు.