T20 WORLD CUP: ఐసీసీ హెచ్చరికలతో దిగొచ్చిన దాయాది
యథాతథంగా భారత్-పాక్ మ్యాచ్
T20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. సోమవారం రాత్రి ఐసీసీ, పీసీబీ, బీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుల సమావేశం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సోమవారం రాత్రి ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, బహుళపక్ష చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటంతో పాటు, ఈ గ్లోబల్ క్రీడ కొనసాగింపునకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్లో మాట్లాడటంతో ఈ సంక్షోభం ముగిసింది.
పాక్ గొంతెమ్మ కోరికలు
ఐదు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పాకిస్థాన్ పలు కీలక డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి అదనపు నిధులు కేటాయించాలి, టీ20 ప్రపంచకప్లో పాల్గొనకపోయినా బంగ్లాదేశ్కు పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయాలి, భవిష్యత్తులో బంగ్లాదేశ్కు ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య హక్కులు ఇవ్వాలి, ఐసీసీ మొత్తం రెవెన్యూలో పాకిస్థాన్ వాటాను పెంచాలి వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, భారత్తో ద్వైపాక్షిక సిరీస్లను పునరుద్ధరించాలి, మ్యాచ్ల సమయంలో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేక ప్రోటోకాల్స్ జారీ చేయాలి అనే అంశాలను కూడా పీసీబీ ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ డిమాండ్లపై ఐసీసీ ఏ మేరకు అంగీకరించిందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు, తమ ఆటగాళ్ల భద్రత కారణంగా భారత్లో పర్యటించలేమని, తమ ప్రపంచకప్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే బంగ్లా ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టమైన హామీ ఇచ్చిన ఐసీసీ, ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, ఐసీసీ స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది.ఈ నిర్ణయంపై పీసీబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీపై పాకిస్థాన్ మండిపడినట్లు తెలిసింది.