T20 WORLD CUP: బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం

సమష్టిగా రాణించిన టీమిండియా … భారత జట్టు సెమీస్‌ బెర్తు ఖాయం!;

Update: 2024-06-23 00:30 GMT

టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.సూపర్‌ ఎయిట్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్య భాయ్‌ మినహా మిగిలిన బ్యాటర్లందరూ రాణించారు. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా కేవలం 146 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ- విరాట్‌ కోహ్లీ శుభారంభం అందించారు. రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆత్మ విశ్వాసంతో కనపడ్డ విరాట్‌ కోహ్లీ... 28 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సులతో 37 పరుగులు చేసి హసీన్‌ షకీబ్‌ బౌలింగ్‌లో అవుట్‌ చేశాడు. తొలి బంతికే సిక్స్‌ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 77 పరుగులకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. తంజీద్‌ హసన్‌ షకీబ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.

రిషభ్ పంత్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో పంత్‌ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న దూబే ఆ తర్వాత ధాటిగా ఆడాడు. 24 బంతుల్లో మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసి దూబే అవుటయ్యాడు. 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకం చేశాడు. చివరి ఓవర్‌ చివరి బంతికి ఫోర్‌ కొట్టి పాండ్యా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. బంగ్లా ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. లిట్టన్‌దాస్‌ను అవుట్‌ చేసి హార్దిక్‌ పాండ్యా టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు. అనంతరం హసన్‌-శాంటో కూడా పర్వాలేదనిపించారు. హసన్ 29, శాంటో 40 పరుగులు చేయడంతో బంగ్లా లక్ష్యం దిశగా పయనించినట్లే కనిపించింది. కానీ కుల్‌దీప్‌ యాదవ్ బంగ్లాను కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన కుల్‌దీప్‌ 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. ఆ తర్వాత పని బుమ్రా పూర్తి చేశాడు. బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్‌ కూడా రెండు వికెట్లు తీశాడు. దీంతో బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News