T20 world cup: ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర
నెదర్లాండ్స్పై టీమిండియా విజయం... మెరుపులు మెరిపించిన శివమ్ దూబే... పోరాటంతో ఆకట్టుకున్న డచ్ జట్టు.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్లోని మోదీ మైదానంలో వేదికగా జరిగిన గ్రూప్-ఏ ఆఖరి మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించింది. బ్యాటింగ్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించగా, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశారు.
దూబే ధనాధన్
టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఆరంభం భారత్కు అనుకూలంగా లేకపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో జట్టు 39/2 స్థితిలో నిలిచింది. ఇషాన్ 18 పరుగులు చేసినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఆఫ్స్పిన్నర్ ఆర్యన్ దత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత టాప్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టాడు. ఈ సమయంలో తిలక్ వర్మ (31) మరియు సూర్యకుమార్ యాదవ్ (34) ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మధ్య ఓవర్లలో పరుగులు నెమ్మదించడంతో 6 నుంచి 11 ఓవర్ల మధ్య భారత్కు కేవలం 32 పరుగులే వచ్చాయి. స్కోరు 69/3 దాటేసరికి ఒత్తిడి పెరిగింది. కానీ ఈ దశలో క్రీజులోకి వచ్చిన దూబే మ్యాచ్ దిశను మార్చేశాడు. మొదట కొంత సమయం తీసుకుని కుదురుకున్న దూబే, ఆ తర్వాత దూకుడైన బ్యాటింగ్తో డచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో దూబే-హార్దిక్ పాండ్యా జోడీ జట్టుకు వేగాన్ని అందించింది. హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 30 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా 75 పరుగులు సాధించడం మ్యాచ్లో కీలక మలుపు అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డచ్ బౌలర్లలో వాన్బీక్ మూడు వికెట్లు తీసినా, చివర్లో దూబే విధ్వంసాన్ని ఆపలేకపోయాడు.
నెదర్లాండ్స్ పోరాటం
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలో ధైర్యంగా ఆడింది. మాక్స్ ఓ’డౌడ్ (35), మైఖేల్ లెవిట్ (51) జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చారు. పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 36/1గా ఉండగా, మధ్య ఓవర్లలో బాస్ డెలీడ్ (33) కూడా కీలక పాత్ర పోషించాడు. 12 ఓవర్లకు నెదర్లాండ్స్ 94/2తో పోటీలో నిలిచింది. అయితే ఈ దశలో భారత స్పిన్నర్లు చెలరేగారు. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. వరుసగా ఆకర్మ్యాన్, ఆర్యన్ దత్ను ఔట్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. శివమ్ దూబే కూడా 2 వికెట్లు తీసి తన ఆల్రౌండ్ ప్రతిభను చాటాడు. బుమ్రా 1/17తో పొదుపుగా బౌలింగ్ చేశాడు. 14 ఓవర్లకు 112/5గా నిలిచిన డచ్ జట్టు రన్రేట్ ఒత్తిడిలో పడింది. అయినా క్యాషే (26), క్రోస్ (25 నాటౌట్), ఎడ్వర్డ్స్ (15) చివరి వరకూ పోరాడారు. చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగినా, నెదర్లాండ్స్ 7 వికెట్లకు 176 పరుగులకే పరిమితమైంది. భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.